వెల్లింగ్టన్: కీలక సమయంలో రిషభ్ పంత్ రనౌట్ అవ్వడం మ్యాచ్లో కీలక మలుపు. అజింక్య రహానె తప్పిదం కారణంగానే మేము టీమిండియాను త్వరగా ఆలౌట్ చేయగలిగాం అని న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ పేర్కొన్నాడు. ఒకవేళ ఈ రనౌట్ అవకాశం రాకుంటే.. పంత్ రహానెతో కలిసి భారీ స్కోరు చేసేవాడని చెప్పుకొచ్చాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 165 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
వెల్లింగ్టన్ టెస్ట్.. రహానె కోసం పంత్ త్యాగం!!
మ్యాచ్ అనంతరం టిమ్ సౌథీ మాట్లాడుతూ... 'రహానెను ఔట్ చేసేందుకు మేం ఎలాంటి వ్యూహం అనుసరించలేదు. రెండో రోజు ప్రారంభంలోనే పంత్ రనౌట్ కావడం మ్యాచ్లో కీలక మలుపు. ఒకవేళ రనౌట్ అవకాశం రాకుంటే.. రహానెతో కలిసి పంత్ వేగంగా పరుగులు చేసేవాడు. మాకు అదృష్టం కలిసొచ్చింది. పంత్ పెవిలియన్ చేరితే రహానె దూకుడుగా ఆడతాడని తెలుసు. అందుకే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసాం. టీమిండియాను తక్కువ పరుగులకే ఆలౌట్ చేశాం' అని అన్నాడు.
'నా బౌలింగ్ వేగం గురించి ఆందోళన చెందడం మానేశా. నా మిగతా నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నా. మొదటి రోజులా గాలులు వేగంగా వీచకపోయినా.. వాతావరణం అనుకూలిస్తుండటంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేశాను. ప్రస్తుతం మ్యాచులో మేం మంచి స్థితిలో ఉన్నాం. ఇదే జోరును ఆదివారం కొనసాగిస్తే.. భారీగా పరుగులు చేయొచ్చు. బేసిన్ రిజర్వ్లో రెండో రోజు బంతి తిరగడం ఇంతకుముందు చూడలేదు. అందుకే తొలి ఇన్నింగ్స్లో పరుగులు చేయడం అత్యంత కీలకం. ముందుగానే భారీ స్కోరు చేస్తే.. ఆ తర్వాత సులభం అవుతుంది. మిగతా మూడు రోజుల్లో పిచ్ ఎలా ఉంటుందో చూడాలి' అని సౌథీ పేర్కొన్నాడు.
ఓవరనైట్ స్కోర్ 122/5తో రెండో రోజు ఇన్నింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో మెరుపులు మెరిపిస్తాడని భావించిన పంత్.. అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. టీమ్ సౌతీ వేసిన 59 ఓవర్ రెండో బంతిని రహానె ఆఫ్సైడ్ తరలించి పరుగు తీయాలని చూసాడు. అయితే బంతి ఫీల్డర్ సమీపంలోకి రావడంతో.. నాన్స్ట్రైక్లో ఉన్న పంత్ పరుగు తీయడానికి సంశయించాడు. పంత్ పరుగు వద్దు అని చెప్పేలోపే రహానె సగం పిచ్ దాటేశాడు.
రహానె సగం పిచ్ దాటేయడంతో ఇక చేసేదేమి లేక పంత్ కూడా పరుగు కోసం ప్రయత్నం ప్రారంభించాడు. అయితే అప్పటికే బంతి అందుకున్న ఫీల్డర్ అజాజ్ పటేల్ నేరుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు. అప్పటికీ పంత్ క్రీజు చేరుకోకపోవడంతో రనౌట్ అయ్యాడు. దీంతో పంత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. టెస్టుల్లో పంత్ రనౌట్ కావడంపై క్రికెట్ విశ్లేషకులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పంత్ రనౌటవ్వడానికి కారణం రహానె అంటూ నిందిస్తున్నారు.