ఫాబ్-4లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ డిబేట్లో తాజాగా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథి చేరాడు. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్లను క్రికెట్ ప్రపంచం ఫాబ్-4గా పిలుస్తారు. అయితే ఇటీవల జో రూట్ టెస్టు ఫార్మాట్లో పరుగుల వరద పారిస్తుండటంతో ఫాబ్-4లో అతనే అత్యుత్తమం అని ఇంగ్లండ్ మాజీలు వాదనలు మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో టిమ్ సౌథి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫాబ్-4లో తమ దేశ ఆటగాడు కేన్ విలియమ్సన్నే అత్యుత్తమని సౌథి పేర్కొన్నాడు. ''నెట్స్లో కేన్కు నేను బౌలింగ్ చేశాను. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన అతన్ని నెట్స్లో ఔట్ చేయడం మా బౌలర్లకు ఎంతో కఠినమైన సవాలు. కేన్ రాణించడాన్ని చూడటం ఎంతో బాగుంది. ఇక మిగిలిన బ్యాటర్లు కూడా అద్భుతమైన వాళ్లే. అందుకే వాళ్లను ఫాబ్-4 అంటారు'' అని సౌథి పేర్కొన్నాడు.

ఫాబ్-4లో విరాట్ కోహ్లి ఒక్కడే టెస్టు ఫార్మాట్లో 50 కంటే తక్కువ సగటుతో ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లు అయిన వన్డే, టీ20ల్లో కోహ్లిదే పైచేయి. కానీ సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం మిగిలిన బ్యాటర్ల గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. జో రూట్ 34 సెంచరీలు, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ చెరో 32 సెంచరీలు చేయగా 29 శతకాలే బాదాడు. సగటు పరంగా స్మిత్ (56.97), విలియమ్సన్ (54.98), రూట్ (50.62), కోహ్లి (49.15) వరుసగా ఉన్నారు.
ఫాబ్-4లో లాస్ట్ ర్యాంక్ కోహ్లికే
ఫాబ్-4లో విరాట్ కోహ్లి చివరి ర్యాంక్ ఇస్తానని ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ పేర్కొంది. ''కోహ్లికి అన్నింట్లో నంబర్ వన్గా రేటింగ్ ఇస్తాను. కానీ ఫాబ్-4లో మాత్రం నాలుగో ర్యాంక్ ఇస్తాను. నంబర్ల పరంగా నాలుగో స్థానం ఇచ్చాను. కానీ కోహ్లి ఎంతో గొప్ప క్రికెట్ ఆడాడు. ఒత్తిడిలో అతని ఆట ఎంతో విశేషమైనది'' అని హీలీ ఓ పోడ్కాస్ట్లో పేర్కొంది.
కాగా, టెస్టు ఫార్మాట్లో రూట్ రికార్డులు బ్రేక్ చేస్తూ తానే అత్యత్తుమ ఆటగాడిగా మాజీల నుంచి ప్రశంసల దక్కించుకుంటున్నాడు. తాజాగా రూట్ మరో ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆరో ఆటగాడిగా రూట్ (12402) చరిత్రకెక్కాడు. కుమార సంగక్కర(12402)ను అధిగమించి ఈ ఘనత అందుకున్నాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ రికార్డు నెలకొల్పాడు.