
హామిల్టన్: టీమిండియా రోజురోజుకూ విదేశాల్లో మెరుగైన జట్టుగా అవతరిస్తోంది. భారత జట్టుతో ఆడటం కష్టంగా ఉంది అని న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ పేర్కొన్నాడు. ఆక్లాండ్లో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచులలో టీమిండియా అద్భుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. బుధవారం జరిగే టీ20లో కూడా గెలిస్తే కివీస్ గడ్డపై తొలి టీ20 సిరీస్ను కైవసం చేసుకొని భారత్ రికార్డు సృష్టిస్తుంది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హామిల్టన్లోని సెడాన్ పార్క్లో మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది.
తాజాగా టిమ్ సౌథీ మాట్లాడుతూ... 'గత కొంత కాలంగా భారత్ అద్భుతంగా ఆడుతోంది. ఫార్మాట్ ఏదైనా విజయమే లక్ష్యంగా ఆడుతున్నారు. టీమిండియాలో ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ లాంటి టాప్ ప్లేయర్లు ఉన్నారు. ప్రస్తుత టీ20 సిరీస్లో లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ అమోఘం. ఈ జోడీనే మా నుండి మ్యాచులను లాగేసుకుంది' అని అన్నాడు.
'తొలి టీ20లో మేం కాస్త కష్టపడితే గెలిచేవాళ్లం. అయితే రెండో టీ20లో మాత్రం అన్ని విభాగాల్లో పూర్తిగా తేలిపోయాం. టీమిండియాతో ఆడటం చాలా కష్టమని తెలుసు. రోజురోజుకూ విదేశాల్లో మెరుగైన జట్టుగా అవతరిస్తోంది. మూడో మ్యాచులో కోహ్లీసేనను ఓడించాలంటే మేం అత్యుత్తమంగా ఆడాలి. అయితే వేదిక మార్పు మాకు కొంత మేలు చేస్తుంది. మేం గెలవాలంటే జట్టుగా రాణించాలి. తొలి రెండు మ్యాచుల నుంచి మా కుర్రాళ్లు నేర్చుకున్నారు. ఈ మ్యాచ్ గెలిచి మేం సిరీసును సజీవంగా ఉంచుకోవాలి' అని సౌథీ పేర్కొన్నాడు.
సెడాన్ పార్క్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతంగా ఉన్నా.. వర్ష సూచన లేదు. గత ఐదు టీ20 మ్యాచ్లలో మూడు సార్లు జట్లు 190కి పైగా స్కోర్లు చేశాయి. ఏడాది క్రితం ఇక్కడే జరిగిన మ్యాచ్లో కివీస్ 212 పరుగులు చేసి కూడా కేవలం 4 పరుగులతోనే భారత్పై గెలిచింది. అయితే హామిల్టన్ పిచ్పై చక్కటి రికార్డు ఉండటం న్యూజిలాండ్కు కలిసొచ్చే అంశం. గతంలో ఇక్కడ 9 మ్యాచ్లు ఆడిన కివీస్.. ఏడింట విజయం సాధించింది.