హైదరాబాద్: కెప్టెన్, వైస్ కెప్టెన్ లు దూరమైన జట్టుకు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుంది పరిస్థితి. ఇప్పటికే ట్యాంపరింగ్ వివాదంతో సీనియర్ ఆటగాళ్లైన స్టీవ్ స్మిత్, బాన్ క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్లు జట్టుకు దూరమైయ్యారు. అగమ్య గోచరమైన పరిస్థితుల మధ్య జట్టు పగ్గాలను యువ ఆటగాడు, వికెట్ కీపర్ టీమ్ పెయిన్కు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ టెస్టులో కొత్త కెప్టెన్ గాయానికి గురైయ్యాడు.
రెండో రోజు ఆటలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు చాద్ సేయర్స్ వేసిన బంతిని అందుకునే ప్రయత్నంలో టిమ్ పెయిన్ కుడి బొటన వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. గాయంతో విలవిలాడిన అతను అసౌకర్యంగానే మ్యాచ్లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్లో సైతం ఆర్డర్ మార్చుకుని 7వ స్థానంలో బరిలోకి దిగాడు.
Aussies confirm Paine injury: https://t.co/5xG3f254rR #SAvAUS pic.twitter.com/172cO7RmRR
— cricket.com.au (@CricketAus) April 1, 2018
అయితే అతని బొటన వేలు చిట్లినట్లు ఫిజియోలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అతను ఈ టెస్టు చివరి వరకు కొనసాగడం కష్టంగా మారింది. ఏ నిమిషంలోనైనా సిరీస్ నుంచి వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ టెస్టు ఆరంభం ముందే స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కాలి గాయంతో సిరీస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
టిమ్ పెయిన్కు చేతిగాయాలు కొత్తేమీ కాదు. 2010లో ఓసారి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతని కుడిచేతి వేలు విరిగింది. ఆ ప్రదేశంలో ఎనిమిది కుట్లు వేయడంతో పాటు ఓ మెటల్ ప్లేటు కూడా ఇప్పటికీ ఉంది.