మరో వారం రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసుకున్న భారత్కు ఈ సిరీస్ ఎంతో కీలకం. అయిదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియాపై కనీసం 4-0 తేడాతో గెలవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ముచ్చటగా మూడో సారి డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరగలదు. నవంబర్ 22 నుంచి ఈ సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కానుంది.
అయితే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు టీమిండియాను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం కొనసాగిస్తున్నారు. విరాట్ కోహ్లి ఫామ్ గురించి విమర్శలు చేసిన రికీ పాంటింగ్కు కోచ్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత క్రికెట్తో పాంటింగ్కు పనేంటని, ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి చూసుకోవాలని గంభీర్ ఘూటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా మాజీలు గంభీర్ను టార్గెట్ చేస్తున్నారు.

''రికీ పాంటింగ్పై గంభీర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం నాకు నచ్చలేదు. పాంటింగ్ను గంభీర్ ఇప్పటికీ పోటీదారునిగా చూస్తున్నాడనుకుంటా. కానీ పాంటింగ్ ఇప్పుడు కామెంటేటర్. తన అభిప్రాయానికి చెప్పడానికి వేతనాన్ని తీసుకుంటున్నాడు. స్పాట్లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. విరాట్ ఫామ్ ఆందోళనకరంగానే ఉంది. అయితే టీమిండియాకు కోహ్లి, రోహిత్ శర్మ ఫామ్ ప్రస్తుత సమస్య కాదు. అసలు సమస్య.. ఒత్తిడిలో ప్రశాంతంగా కోచ్ పనిచేయడం''
''గత రెండు పర్యటనల్లో భారత్ విజయాల్లో రవిశాస్త్రి పాత్ర కీలకం. అతను జట్టులో గొప్ప వాతావరణాన్ని తీసుకువచ్చాడు. ప్లేయర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ,అభిరుచితో ఆడేలా చేశాడు. కలలు సాకారం చేసేలా ప్రేరణ కలిపించాడు. కానీ ప్రస్తుత కోచ్ తీవ్ర పోటీతత్వంతో ఉన్నాడు. అయితే అది కోచ్గా సరైన మార్గం కాదు. మంచిది కూడా కాదు. భారత క్రికెట్కు సరైనోడు కాదని నా అభిప్రాయం'' అని టిమ్ పైన్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).