టీమిండియా యువ క్రికెటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ బంపర్ ఆఫర్ పట్టేశాడు. ఏకంగా కెప్టెన్గా ప్రమోషన్ కొట్టేశాడు. ఐపీఎల్లో ముంబై తరపున సూపర్ బ్యాటింగ్తో చెలరేగి టీమిండియాలో చోటు సంపాదించుకున్న తిలక్ వర్మ.. దేశవాళీ టోర్నీల్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే తాజాగా తిలక్ను హైదరాబాద్ జట్టు కెప్టెన్గా హెచ్సీఏ ప్రకటించింది.
ఈ నెల 16వ తేదీ నుంచి దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీ కోసం టీం సెలక్షన్ పనిలో భాగంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇన్ ఫామ్ బ్యాటర్ తిలక్ వర్మకు హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది.

ఈ మధ్య జరిగిన 2023 ఆసియా క్రీడల్లో టీమిండియా తరపున తిలక్ వర్మ గొప్పగా రాణించాడు. అంతకుముందు వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే అతడిపై సెలక్టర్ల దృష్టి పడింది. ఫలితంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును ముందుండి నడిపించే అవకాశాన్ని కల్పించారు సెలక్టర్లు.
ఇదిలా ఉంటే తిలక్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో
టీమిండియా వెటరన్ ప్లేయర్స్ అజింక్య రహానే, భువనేశ్వర్ కుమార్తో పాటు యంగ్ ప్లేయర్స్ రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లకు కూడా హెచ్సీఏ స్థానం కల్పించింది. ఇక ఈ ఆటగాళ్లందరికీ టీమిండియా తరపున ఆడిన అనుభవం ఉండడంతో దేశవాళీలో అద్భుతంగా రాణించే అవకాశం ఉంది.
కాగా.. 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టోర్నీ నవంబర్ 6వ తేదీ వరకు జరగనుంది. ఇందులో 39 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని 5 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో 9 జట్లు, గ్రూప్ బీ, గ్రూప్ సీల్లో 8 జట్లు, గ్రూప్ డీ, గ్రూప్ ఈల్లో 7 జట్లు చొప్పున బరిలోకి దిగుతున్నాయి.