సెంచూరియన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో, 8 ఫోర్లు, 7 సిక్సర్ల) సెంచరీతో కదంతొక్కాడు.
అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతంతో సత్తాచాటడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహరాజ్, సిమెలన్ చెరో రెండు వికెట్లు, జేన్సన్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులకు పరిమితమైంది. లక్ష్యఛేదన ఆరంభంలో దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఓ దశలో సఫారీలు పోటీలోనే లేరు.

కానీ జేన్సన్ (54 నాటౌట్; 17 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) అద్భుతంగా పోరాడారు. కాగా, శతకంతో సత్తాచాటిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ మాట్లాడుతూ.. తన సెంచరీకి కారణం కెప్టెన్ సూర్యకుమార్ అని అన్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇవ్వడంతోనే ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడానని చెప్పాడు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో తిలక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే.
''నా అనుభూతి మాటల్లో వర్ణించలేకపోతున్నాను. దేశం తరఫున ఆడటం నా కల. జట్టుకు అవసరమైన స్థితిలో శతకాన్ని సాధించాను. సెంచరీ క్రెడిట్ మా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఇవ్వాలి. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. స్వేచ్ఛగా నా ఆట ఆడమని చెప్పాడు. ఇక పిచ్ అంత సులువుగా లేదు. అభిషేక్ శర్మ ఔటైన తర్వాత వచ్చిన కొత్త బ్యాటర్లకు అంత ఈజీగా లేదు. ఎక్కువసేపు క్రీజులో ఉండాలని, మరో భాగస్వామ్యాన్ని నమోదు చేయాలని భావించాను'' అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.