చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూకుకెళ్లింది టీమిండియా. ఈ మ్యాచ్లో యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ (72*) 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తన విరోచిత పోరాటంతో మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఈ క్రమంలోనే తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్లలో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో రెండు ఔట్లు మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ సూపర్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ సూపర్ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మార్క్ చాప్మన్ అందుకున్నాడు. అతడే ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగాడు. అతడు టీ20ల్లో రెండు డిస్మిసల్స్ మధ్య 271 పరుగులు సాధించాడు. ఇప్పుడు తాజా మ్యాచ్లో చాప్మన్ రికార్డును ఈ హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచాడు.

కోహ్లీ రికార్డ్ బ్రేక్
టీ20ల్లో రెండు ఔట్లు మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో టీమిండియా తరఫున కోహ్లీ (258), సంజూ శాంసన్ (257), రోహిత్ శర్మ (253), శిఖర్ ధావన్ (252) ఉన్నారు.
టీ20ల్లో రెండు ఔట్ల మధ్య అత్యధిక పరుగులు చేసింది వీరే..
1. 318 తిలక్ వర్మ (107*, 120*, 19*, 72*)
2.271 మార్క్ చాప్మన్ (65*, 16*, 71*, 104*, 15)
3.240 శ్రేయస్ అయ్యర్ (57*, 74*, 73*, 36)
4.240 ఆరోన్ ఫించ్ (68*, 172)
5.239 డేవిడ్ వార్నర్ (100*, 60*, 57*, 2*, 20)
ఈ మ్యాచ్ లో.. తొలి టీ20లోలాగా ఇంగ్లాండ్ జట్టు అంత ఈజీగా లొంగలేదు. సవాలు విసిరే లక్ష్యాన్ని నిలిపింది. బంతితోనూ భారత్ను కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన సూపర్ ఫామ్ తో.. భారత జట్టును గెలిపించాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 165 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ 19.2 ఓవర్లలోనే 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.