పేలవమైన ఫీల్డింగ్ అంటే క్రికెట్ అభిమానులకు మొదట గుర్తొచ్చేది పాకిస్థాన్ టీమ్. చేతికి అందిన క్యాచ్లను సులువుగా నేలపాలు చేయడం, ఓ క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు పోటాపోటీ పడి ఎవరూ అందుకోకపోవడం పాకిస్థాన్ క్రికెటర్ల స్టైల్. అయితే చెత్త ఫీల్డింగ్లో పాకిస్థాన్కు గట్టి పోటీ ఇవ్వడానికి బంగ్లాదేశ్ సిద్ధమైంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దారుణమైన ఫీల్డింగ్ వైఫల్యంతో విమర్శలు ఎదుర్కొంటుంది.
శ్రీలంక ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు క్యాచ్లను బంగ్లాదేశ్ ఫీల్డర్లు చేజార్చారు. అందులో ఓ క్యాచ్ను మిస్ చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. ఫస్ట్ స్లిప్లో అందుకోవాల్సిన ఆ క్యాచ్ కోసం ముగ్గురు ఫీల్డర్లు ట్రై చేశారు. కానీ అందుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త ఫీల్డింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..ఖలీద్ అహ్మద్ వేసిన బంతిని ప్రభత్ జయసూర్య షాట్కు యత్నించాడు. కానీ అది ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో ఉన్న బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో చేతిలో పడింది. కానీ దాన్ని అతడు అందుకోలేకపోయాడు. షాంటో చేతుల్లో పడి గాల్లోకి లేచిన బంతిని సెకండ్ స్లిప్లో ఉన్న షాహదత్ డిపు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ డిపు చేతుల్లో పడి అది కూడా మిస్ అయ్యింది. వెంటనే థర్డ్ స్లిప్లో ఉన్న జకీర్ క్యాచ్ అందుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఫలితం లేకపోయింది.
ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇది బంగ్లా క్రికెటర్లు వాలీబాల్ ఆడటానికి ట్రై చేస్తున్నట్లుగా ఉందని, ఇలా ముగ్గురు చేతుల్లో బాల్ పడి క్యాచ్ నేలపాలు కావడం క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 531 పరుగుల భారీ స్కోరు సాధించింది. కుశాల్ మెండిస్ (93; 150 బంతుల్లో), కామిందు మెండిస్ (92; 167 బంతుల్లో), దిముత్ కరుణరత్నె (86; 129 బంతుల్లో), ధనంజయ డిసిల్వా (70; 111 బంతుల్లో), నిశాన్ మధుష్క (57; 105 బంతుల్లో) సత్తాచాటారు.