హైదరాబాద్: బాక్సింగ్ డే టెస్టులో తాను కచ్చితంగా ఆడతానని ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా జనవరి 26 నుంచి భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు మ్యాచ్ మెల్ బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో టెస్టు మ్యాచ్ని నెగ్గడంతో సిరిస్ 1-1తో సమం అయింది.
పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వేసిన బంతి ఫించ్ వేలిని తీవ్రంగా గాయపరిచింది. దీనిపై తాజాగా ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ "గాయం అయిన నా వేలిని తీసేస్తే తప్ప ఈ టెస్టు ఆడకుండా ఉండను. రెండేళ్ల క్రితం శ్రీలంకతో మ్యాచ్లో వేలికి గాయం అయింది. మళ్లీ తాజాగా రెండో టెస్టు మహ్మద్ షమి వేసిన బంతి అదే వేలికి తగిలి గాయం చేసింది" అని అన్నాడు.
దీంతో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉందని ఆరోన్ ఫించ్ తెలిపాడు. అయితే, ఫించ్ ఈ గాయం నుంచి కోలుకోవడంతో మూడో టెస్టు ఆడేందుకు గాను చికిత్సను అందించిన వైద్యుల నుంచి అతడికి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనిపై ఆరోన్ ఫించ్ ఆదివారం నెట్స్లో అటు బ్యాటింగ్తోనూ ఇటు ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ చేశానని, కొంచెం మెరుగైందని పేర్కొన్నాడు.