వ్యక్తిగత కారణాలతో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లిపై వస్తున్న విమర్శలను దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఖండించాడు. క్రికెటర్గా అత్యున్నత స్థాయికి ఎదగడంలో సాయపడిన వాళ్లకి కష్టకాలంలో తోడుగా ఉంటే తప్పేమి లేదని స్టెయిన్ అన్నాడు. తెరవెనుక సాయం చేసిన వాళ్ల గురించి బయటి ప్రపంచానికి అర్థం కాదని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమైన విషయం తెలిసిందే. సిరీస్లో పాల్గొనాలనే ఉద్దేశంతో కోహ్లి హైదరాబాద్కు కూడా వచ్చాడు. కానీ అత్యవసర కారణాలతో అదే రోజు అతడు తిరిగి ఇంటికి బయలుదేరాడు. మరోవైపు అతడు భారత జట్టుకు దూరమవ్వడానికి తన తల్లికి అనారోగ్యమని, తన భార్య అనుష్క శర్మ రెండో సారి తల్లి కావడమంటూ వార్తలు వచ్చాయి.

అయితే దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కోహ్లి రెండో సారి తండ్రి కాబోతున్నాడని చెప్పడంతో సోషల్ మీడియాలో విరాట్పై విమర్శలు వచ్చాయి. దేశం కంటే కుటుంబం ఎక్కువనా అన్నట్లు ట్రోల్ చేశారు. ఈ పరిస్థితుల్లో డివిలియర్స్ మరోసారి స్పందించాడు. తాను చాలా తప్పిదం చేశానని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశానని, కోహ్లి కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పాడు.
ఈ నేపథ్యంలో డేల్ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ''జీవితం చరమాంకంలో క్రికెట్ పెద్ద విషయం కాదనిపిస్తుంది. నువ్వు ఎందుకు క్రికెట్ ఆడావు? నీకు ఎవరు సాయం చేశారు? అనేది గుర్తు వస్తుంది. తెరవెనుక జరిగే విషయాలు ప్రజలకు తెలియవు. దాన్ని చూడలేరు. మీ భాగస్వామి, మీ తల్లి, మీ భార్య, మీ సోదరి.. ఇలా మీ జీవితంలో వాళ్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. అలాంటి వాళ్లు అనారోగ్యానికి గురైనా, ప్రమాదంలో ఉన్నా అండగా నిలవాలి. ఇది చాలా ముఖ్యమైనది'' అని స్టెయిన్ పేర్కొన్నాడు.
కాగా, కోహ్లి ఇంగ్లండ్తో జరగనున్న మూడు, నాలుగు టెస్టులకు కూడా అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నాయి. చివరి టెస్టులో కూడా అతడు ఆడటం అనుమానమే తెలుస్తోంది. మరోవైపు కోహ్లి నుంచి స్పష్టత కోసమే బీసీసీఐ ఇంకా చివరి మూడు టెస్టులకు జట్టును ప్రకటించలేదని కథనాలు వస్తున్నాయి. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7వ తేదీ నుంచి చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.