టాస్ గెలిచి రాణించిన గుజరాత్..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ జట్టుకు సబ్బినేని మేఘన (24), సోఫియా డంక్లీ (13) ఫర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (46) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కానీ ఆమెకు సహకారం అందించేవారు కరువయ్యారు. అన్నాబెల్ సదర్లాండ్ (8), సుష్మా వర్మ (9) ఇద్దరూ విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన యాష్లే గార్డనర్ (25) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. గార్డనర్, డియోల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ యూపీ బౌలర్లు ఈ జోడీని విడగొట్టారు.
ఛేజింగ్లో దక్కని శుభారంభం..
చివర్లో డయాలన్ హేమలత (21 నాటౌట్), స్నేహ్ రాణా (9 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఈ క్రమంలో 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యూపీకి మంచి ఆరంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్లు అలీసా హేలీ (7), శ్వేతా సెహ్రావత్ (5) ఇద్దరూ విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన కిరణ్ నావగిరే (53) తెలివైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెకు తహ్లియా మెక్గ్రాత్ (0), దీప్తి శర్మ (11) సహకారం అందించలేకపోయారు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది.
ఆ ఇద్దరే ఓడించారు..
అయితే గ్రేస్ హారిస్ (59 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కీలకమైన సమయంలో కిరణ్ అవుటవడంతో యూపీ ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. ఆ తర్వాత సిమ్రన్ షేక్ (0), దేవిక వైద్య (4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో యూపీ గెలుపు అసాధ్యం అని అంతా అనుకున్నారు. గుజరాత్కు ఈ టోర్నీలో తొలి విజయం ఖాయమని అభిమానులు కూడా భావించారు. కానీ చివర్లో హారిస్కు జతకలిసిన ఎక్సెల్టోన్ (22 నాటౌట్) కూడా ధనాధన్ షాట్లతో విరుచుకుపడింది. అయినా సరే చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం అయ్యాయి. అలాంటి సమయంలో భారం తనపై వేసుకున్న గ్రేస్.. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్ చూసిన వారంతా కిరణ్, గ్రేస్ ఇద్దరే గుజరాత్ కొంప ముంచారని కామెంట్లు చేస్తున్నారు.
ఐదు వికెట్లు తీసినా..
దీంతో గుజరాత్ ఈ టోర్నీలో వరుసగా రెండో మ్యాచులోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్లో ముంబై చేతిలో ఈ జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ కూడా గట్టిపోటీ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా బౌలర్లలో కిమ్ గార్త్ ఐదు వికెట్లతో అదరగొట్టింది. యూపీ బ్యాటర్లలో కీలకమైన వారిని ఆమె అవుట్ చేసింది. అలాగే సదర్లాండ్, మాన్సి జోషి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ చివర్లో గ్రేస్ దాడిని వీళ్లు కూడా ఆపలేకపోయారు. దీంతో 19.5 ఓవర్లలోనే 175 పరుగులు చేసిన యూపీ తన తొలి మ్యాచ్లోనే విజయం సాధించింది. అద్భుతమైన పోరాటంతో మ్యాచ్ గెలిపించిన గ్రేస్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.


Click it and Unblock the Notifications












