హైరాబాద్: శ్రీలంకపై కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సాధించిన సెంచరీ స్పిన్నర్లపై తన అత్యుతమ సెంచరీ అని రహానే అన్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 132 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే పెవిలియన్కు చేరాడు. పుజారా (133)తో కలిసి రహానే నాలుగో వికెట్కి 217 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
రెండో టెస్టులో రహానే 222 బంతుల్లో 14 బౌండరీలతో 132 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను 622/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మ్యాచ్ అనంతరం రహానే మీడియాతో మాట్లాడాడు. 'స్పిన్నర్లపై నా బెస్ట్ ఇన్నింగ్స్లలో ఇదొకటి. 9-10 టెస్టుల తర్వాత శతకం సాధించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బౌలర్లపై ఆధిపత్యం చేయడంపైనే దృష్టి సారించా. క్రీజులోకి వెళ్లే ముందే పిచ్ ఎలా స్పందిస్తుందో నాకు తెలుసు' అని రహానే అన్నాడు.

'ఎంతో బౌన్స్ ఉందని, నా గేమ్కు పిచ్ సూట్ అవుతుందా? లేదా? అన్నది అంచనా వేశాను. పుజారాతో కలిసి బౌలర్లపై ఒత్తిడి పెంచా. దాదాపు ఒక్క ఓవర్ కూడా మెయిడెన్ కాకుండా చూశాం. కాబట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచగలిగాం. మ్యాచ్ ముందుకుసాగుతున్నకొద్దీ ఈ వికెట్పై పరుగులు రాబట్టడం కష్టమవుతుంది' అని రహానే తెలిపాడు.
'గాలే టెస్టు తర్వాత ఆతిథ్య జట్టు స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు చక్కని ఫుట్వర్క్ ఉపయోగించాలని అనుకున్నాం. అదే చేసి హెరాత్ బౌలింగ్లో బ్యాక్ఫుట్పై పరుగులు సాధించాం. సరైన చోట బంతులు పడితే మూడో రోజు బ్యాట్స్మెన్ సుదీర్ఘంగా ఆడడం అంత సులభమేమీ కాదు' అని రహానే అన్నాడు.
ఫుట్వర్క్ ఆధారంగానే స్పిన్నర్ల బౌలింగ్లో ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశామని చెప్పాడు. పూజారాతో కలిసి రెండువందల పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం జట్టు వ్యూహంలో భాగమేనని, దానిని తాము అమలుచేశామని రహానే చెప్పాడు.