క్రికెట్లో వికెట్ కీపర్ల పాత్ర చాలా ముఖ్యం. కెప్టెన్ ఎవరైనా సరే బౌలర్లకు ఎక్కువ సూచనలు చేసేది కీపరే. బ్యాటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలో బౌలర్తో కలిసి వ్యూహాలు రచించేది అతనే. అలాగే మైదానంలో అందరి కన్నా ఎక్కువ ఫోకస్తో ఉండాల్సింది కూడా కీపరే. అందుకే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కీపర్లు అందరూ గొప్ప క్రికెటర్లుగా పేరు సంపాదించారు.
ఈ జాబితాలో చేరేందుకు దూసుకెళ్లిన భారత యువ తరంగం రిషభ్ పంత్. రోడ్డు ప్రమాదంలో గాయపడకపోయి ఉంటే.. అతను ఈ తరంలో బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఉండేవాడు. అతను గాయపడటంతో టెస్టు క్రికెట్లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్కు టీమిండియాలో చోటు దక్కింది. ఇప్పుడు మరో కీపర్ కూడా తన అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే తను భారత జట్టుకు కూడా ఎంపిక అవుతానని అంటున్నాడు. అతనెవరో కాదు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఉపేంద్ర యాదవ్. యూపీకి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇటీవలి కాలంలో గుర్తింపు పొందాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అతని ఆట చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే భారత మాజీ చీఫ్ సెలెక్టర్ తనతో అన్న మాటలను ఉపేంద్ర తాజాగా వెల్లడించాడు.
'రిషభ్ పంత్, కోన భరత్ తర్వాత నువ్వే రేసులో ఉన్నావ్. ఇలాగే కష్టపడుతూ ఉంటే.. నీకు కూడా భారత్కు ఆడే అవకాశం వస్తుంది' అని చేతన్ శర్మ చెప్పాడట. యూపీకి చెందిన అతను ఇప్పటి వరకు కేవలం 30 టీ20లే ఆడటం గమనార్హం. యూపీ తరఫున టెస్టు, వన్డే ఫార్మాట్లలో అద్భుతంగా రాణించిన అతనికి టీ20 జట్టులో చోటు దక్కలేదు.
ఈ సమయంలో చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి తనకు కాల్స్ వచ్చినట్లు ఉపేంద్ర చెప్పాడు. తను గాయపడటం వల్ల ఆడటం లేదా? అని వాళ్లంతా ఆరా తీసేవారని, టీ20లు ఆడకపోతే ఐపీఎల్లో అవకాశం దక్కదని చెప్పేవారని ఉపేంద్ర వెల్లడించాడు. దీంతో తన కెరీర్లో కఠిన నిర్ణయం తీసుకొని, యూపీని వదిలేసి రైల్వేస్ జట్టులో చేరానన్నాడు.
రైల్వేస్ తరఫున చక్కగా రాణించడంతో అతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ఆడే అవకాశం రాకపోయినా కూడా.. భవిష్యత్తుపై తాను ఆశాభావంతో ఉన్నానని అన్నాడు. 'యూపీలో మంచి ఫెసిలిటీలు ఉండేవి. అవన్నీ వదిలేసి రావడం కష్టమే. కానీ జీవితం మారాలంటే ఈ నిర్ణయం తప్పదు అనిపించింది' అని చెప్పుకొచ్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కేఎస్ భరత్ బ్యాటుతో ఫెయిలయ్యాడు. దీంతో అతనికి వెస్టిండీస్ సిరీసులో చోటు దక్కడం అనుమానంగా ఉంది. ఈ క్రమంలో విండీస్ సిరీసులోనే ఉపేంద్రకు చోటు దక్కుతుందా? అని కొందరు అనుకుంటున్నారు. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.