హైదరాబాద్: మంగళవారం ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజా అటు బౌలర్, ఇటు ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆల్రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్కి చెందిన షకీబ్ ఉల్ హాసన్ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
దీంతో రవీంద్ర జడేజాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్ కోహ్లీతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు సైతం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జడేజా తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫొటోని పంచుకుని అభిమానులకు, కుటుంబసభ్యులకు, బీసీసీఐ, ఐసీసీ, టీమిండియాకి ధన్యవాదాలు తెలిపాడు.

'ధోనీ, కోహ్లీ వల్లే నేను టెస్టుల్లో బౌలింగ్, ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగాను' అని కామెంట్ పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కోహ్లీసేన శ్రీలంక పర్యటనలో బిజీగా ఉంది. ఇరు జట్ల మధ్య శనివారం చివరిదైన మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టులో నిబంధనలను ఉల్లఘించినందుకు గాను ఐసీసీ జడేజాపై ఓ సస్పెన్షన్ వేటు వేసింది.
దీంతో మూడో టెస్టుకు జడేజా దూరమయ్యాడు. రవీంద్ర జడేజాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. జడేజా క్రీజులో ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ, సెంచరీ సాధించినప్పుడు తన బ్యాట్ని కత్తిలా తిప్పుతాడన్న విషయం తెలిసిందే. దానిని గుర్తు చేస్తూ కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు.
అగ్రస్థానంలో నిలిచిన కత్తి మాస్టర్, మిస్టర్ జడేజాకి అభినందనలని ఆయన పేర్కొన్నాడు. ఇక ఇదే ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో నిలిచిన అశ్విన్కి కూడా కోహ్లీ శుభాకాంక్షలు చెప్పాడు.