వచ్చే ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ ఈవెంట్లో భారత జట్టు కూడా పాల్గొంటోంది. ఈ టోర్నీకి వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ కూడా సెలెక్టయ్యాడు. ఐపీఎల్లో తన ధనాధన్ ఇన్నింగ్సులతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ విదర్భ ప్లేయర్.. తను చైనాలో ఆడతానని అస్సలు ఊహించలేదని, లక్కీగా జట్టుకు ఎంపికయ్యానని అన్నాడు.
ఇప్పటి వరకు దేశవాళీలు, ఐపీఎల్ అనుభవమే ఉన్న అతను.. ఇప్పుడు మరికొంతమంది కుర్రాళ్లతో కలిసి గోల్డ్ మెడల్ కోసం చైనాలో అడుగు పెడుతున్నాడు. క్రికెట్లో ఇలా గోల్డ్ మెడల్స్ సాధించడం చాలా అరుదు. ఎందుకంటే ఇలాంటి క్రీడా వేడుకల్లో సాధారణంగా క్రికెట్ ఉండదు. ఇప్పుడు చైనాలో క్రికెట్ ఆడుతున్నా.. అంతకుముందు ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు నిర్వహించి తొమ్మిదేళ్లు అవుతోంది.

'ఇలాంటివన్నీ ఇప్పటి వరకు టీవీలో, మిల్కాసింగ్ మూవీలో మాత్రమే చూశా. ఇప్పుడు నాకే ఈ ఎక్స్పీరియన్స్ దక్కబోతోంది. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు ఎంపికైనందుకు నిజంగా లక్కీగా ఫీలవుతున్నా' అని చెప్పాడు. చైనా గడ్డపై తొలిసారి టీమిండియా జెర్సీలో ఆడటమే ఒక ఘనత అని చెప్పొచ్చు. అయితే తను మాత్రం ఫైనల్లో గోల్డ్ మెడల్ కొట్టాక పోడియం అంతా దద్దరిల్లేలా జరిగే జాతీయ గీతాలాపన చేయడంపైనే ఫోకస్ పెట్టానని జితేశ్ అంటున్నాడు.
ఇలా ఆసియా క్రీడలకు ఎంపికవుతానని తాను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని జితేశ్ చెప్పాడు. చైనా వెళ్లే టీమ్స్ను ట్విట్టర్లో ప్రకటించినప్పుడే తన పేరు ఉండటం చూశానన్నాడు. 'చైనాలో టీమిండియా తరఫున ఆడతాననే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. అసలు క్రికెట్ విషయాల్లో చైనా గురించి ఆలోచించం కదా' అని చెప్పాడు. చైనా స్వయంగా క్రికెట్ ఆడే దేశం కూడా కాదు.
'కానీ ఏదేమైనా, ఎక్కడ ఆడినా.. క్రికెట్ అంటే క్రికెటే కదా. అందుకే ఎక్కడ ఆడే అవకాశం దొరికినా ఎంజాయ్ చేయాలి అంతే' అని చెప్పుకొచ్చాడు. ఈ ఆసియా క్రీడల్లో టీమిండియా సారధిగా మహారాష్ట్ర కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి కుర్రాళ్లను జట్టులో చేర్చారు.