టీమిండియా సారథి రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. దేశానికి కప్ను అందించిన మూడో కెప్టెన్గా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు. 1983లో కపిల్, 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ల్లో ధోనీ దేశాన్ని జగజ్జేతగా నిలిపిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్-2024ను గెలిచిన రోహిత్ తాజాగా ఈ అరుదైన జాబితాలో చేరాడు. అయితే హిట్మ్యాన్ గతంలోనే ప్రపంచకప్ విజేతగా నిలవాల్సి ఉంది.
2023 వన్డే వరల్డ్ కప్లో భారత్ విజయాలతో జైత్రయాత్ర కొనసాగించింది. కానీ ఆఖరి మెట్టుపై బోల్తాపడి కప్ను చేజార్చుకుంది. ఆ బాధను దిగమింగి ఏడు నెలల తర్వాత టీమిండియా మరో మహాసమరంలో పాల్గొంది. ఈ సారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సాధించింది. 13 ఏళ్ల ప్రపంచకప్ కల, 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణ నెరవేరింది.

ఈ ప్రపంచకప్ గెలవడంలో రోహిత్ ప్రధాన పాత్ర పోషించాడు. సారథిగా వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేయడమే కాకుండా, ఓపెనర్గా బౌలర్లను వణికించాడు. 36 సగటు, 156 స్ట్రైక్రేటుతో 257 పరుగులు చేశాడు. మూడు అర్ధశతకాలు సాధించాడు. అయితే వరల్డ్ కప్ గెలిచిన అనంతరం మాట్లాడిన రోహిత్ ఇది ఎన్నోఏళ్ల కష్టమని, ఒక్కరోజుతో సాధించింది కాదని తెలిపాడు. అలాగే విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, కోహ్లి, హార్దిక్ పాండ్య గురించి కొనియాడాడు.
కానీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందాన్ని వర్ణించలేదు. అయితే కప్ అందుకున్న కొన్ని గంటల అనంతరం సోషల్ మీడియా వేదికగా రోహిత్ ఓ పోస్ట్ చేశాడు. ఫైనల్ విజయానంతరం తన ఫీల్డింగ్ స్థానంలో పడుకుని సాధించాను అన్నట్లుగా రిలాక్స్ అయిన ఫొటోను రోహిత్ పోస్ట్ చేశాడు. దానికి క్యాప్షన్ రాశాడు. టీ20 వరల్డ్ కప్ విజయం అనుభూతులు త్వరలో పంచుకుంటానని చెప్పాడు.
''నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఈ ఫొటో వివరిస్తుంది. వరల్డ్ కప్ గెలవడం నాకెంతో గొప్పనో చెప్పడానికి ఎన్నో పదాలు ఉన్నాయి. కానీ వాటిలో సరైన పదాలను వెతకలేకపోతున్నాను. కానీ తర్వాత దీన్ని తప్పక చెప్తాను. ప్రస్తుతం వంద కోట్ల మంది కల సాకరమైన క్షణాన్ని ఆస్వాదిస్తున్నా'' అని రోహిత్ రాసుకొచ్చాడు. కాగా, టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం అంతర్జాతీయ టీ20లకు 37 ఏళ్ల రోహిత్ గుడ్బై పలికిన విషయం తెలిసిందే.