సెంచరీ చేశాక మా నాన్న గురించే ఆలోచిస్తున్నా
ఈ సందర్భంగా తన కోసం తండ్రి(పంకజ్) పడ్డ కష్టాన్ని పృథ్వీ షాగుర్తుచేసుకున్నాడు. పృథ్వీషా మాట్లాడుతూ "సెంచరీ చేశాక మా నాన్న గురించే ఆలోచిస్తున్నా. ఎందుకంటే నా కోసం ఆయన చాలా త్యాగాలు చేశాడు. నా తొలి సెంచరీ ఆయనకే అంకితమిస్తున్నాను. నేనెప్పుడు పరుగులు చేసినా.. అది ఆయన కోసమే" అని పృథ్వీ షా వెల్లడించాడు.
ఆనందం వ్యక్తం చేసిన పృథ్వీ షా
తొలి రోజు ఆట ముగిసిన ఆనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే సెంచరీ నమోదు చేయడం చాలా మంచి అనుభూతిని ఇచ్చిందని పృథ్వీ షా పేర్కొన్నారు. తొలుత కొద్దిగా ఒత్తిడికి లోనైనప్పటికీ.. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నానని ఈ సందర్భంగా వెల్లడించాడు.
బౌలర్లపై ఆధిపత్యం చలాయించడం ఇష్టం
ఇన్నింగ్స్ మొత్తం తన సహజ శైలిలోనే ఆడానని తెలిపాడు. తనకు బౌలర్లపై ఆధిపత్యం చలాయించడం ఇష్టమని తెలిపాడు. "భారత జట్టు కోసం ఆడటమనేది నాకు చాలా గొప్ప విషయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా. చిన్నప్పటి నుంచే స్కూల్ క్రికెట్ ఆడేవాడిని. ఏడాదికి 30 నుంచి 35 స్కూల్ గేమ్స్ ఆడేవాడిని. రంజీలో చాలా రోజులు ఆడాను.. ఆ అనుభవం నాకు చాలా ఉపయోగపడింది" అని పృథ్వీ షా తెలిపాడు.
షాకు చిన్న వయసులోనే క్రికెట్ ఓనమాలు నేర్పింది తండ్రే
ఇదిలా ఉంటే, పృథ్వీ షాకు చిన్న వయసులోనే క్రికెట్ ఓనమాలు నేర్పింది.. అతను క్రికెట్ను కెరీర్గా ఎంచుకునేలా చేసింది.. ఎన్నో కష్టాలకు ఓర్చి అతడిని అంతర్జాతీయ క్రికెటర్గా తీర్చిదిద్దింది తండ్రి పంకజ్ షా. తన వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టి కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు పంకజ్. నాలుగేళ్ల వయసులోనే పృథ్వీ తల్లిని కోల్పోయాడు.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులెదురైనా
అప్పటి నుంచి అన్నీ తానై వ్యవహరించాడు. కుటుంబానికి నడపడానికి కాకుండా మిగిలిన డబ్బంతా పృథ్వీ శిక్షణకే వినియోగించాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులెదురైనా కొడుకు కెరీర్ విషయంలో మాత్రం రాజీ పడలేదు. షాను ప్రతి దశలోను ఎంకరేజ్ చేయడంతో ఈరోజు అతడు ఈ స్థాయికి చేరుకున్నాడు.