భారత్తో జరిగిన రెండో వన్డేలో న్యూజిల్యాండ్ అత్యంత ఘోరంగా ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 179 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ ఓటమి కివీస్ జట్టను చాలా కాలం వెంటాడుతుందని మాజీ క్రికెటర్, ప్రముఖ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
ఇలాంటి ఓటములు ఏ జట్టుకైనా పీడకలల వంటివని బంగర్ అన్నాడు. ఇవి చాలా కాలం ఆ జట్టును వెంటాడి తీరతాయని స్పష్టం చేశాడు. న్యూజిల్యాండ్ అంటేనే సీమ్ పిచ్లు గుర్తొస్తాయని, అలాంటి జట్టును భారత పేసర్లు ఇబ్బంది పెట్టడం అనేది చాలా కఠినమైన వాస్తవమని బంగర్ చెప్పాడు. దీన్ని కివీస్ జట్టు జీర్ణం చేసుకోవడం కుదరదని, వరుసగా రెండు మ్యాచుల్లో భారత పేసర్లు ఆ జట్టును ఇబ్బంది పెట్టడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడ్డాడు.
'కివీస్ బ్యాటర్లకు భారత బౌలర్లందరూ సమస్యలు సృష్టించారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ రెండు జట్లు ఏదైనా నాకౌట్ మ్యాచ్ ఆడితే.. ఈ పీడకల వాళ్లను కుదురుగా కూర్చోనివ్వదు. ఇది ఆటగాళ్ల మనసులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. భారత జట్టును ఓడించడం అసాధ్యం అనిపిస్తుంది. ఇలాంటి విజయాలు ఓడిన జట్టుపై చాలా కాలం ప్రభావం చూపుతాయి' అని బంతర్ వివరించాడు. భారత పేసర్లు తమను ఇబ్బంది పెట్టారనే నిజాన్ని కివీస్ జట్టు చాలా కాలం జీర్ణించుకోలేదని చెప్పాడు. వరుసగా రెండు మ్యాచుల్లో భారత పేసర్ల దెబ్బకు ఆ జట్టు విలవిల్లాడటం ఆ జట్టు ఇప్పుడప్పుడే మర్చిపోలేదని స్పష్టం చేశాడు. మరి మూడో వన్డేలో కివీస్ ఎలా ఆడుతుందో చూడాలి.