ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి వేళైంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ మినీ ప్రపంచ కప్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో విజయం సాధించి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడలనే పట్టుదలతో ఉందీ భారత జట్టు. ఈ సందర్భంగా అసలు ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా మొదలైంది?, ఎప్పుడు ప్రారంభమైంది? దాని లక్ష్యమేంటి? వంటి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
ఇదే ప్రధాన లక్ష్యం..
ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ తొలిసారిగా 1998లో ప్రారంభించింది. అప్పుడు ఈ మెగా టోర్నీ అసలు పేరు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ. టెస్టు క్రికెట్ ఆడని దేశాల్లో.. క్రికెట్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, అందుకోసం నిధులు సమీకరించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నికి శ్రీకారం చుట్టారు. చివరగా 2017లో ఈ టోర్నీ జరిగింది. 2002లో ఈ ఐసీసీ నాకౌట్ ట్రోఫీని.. ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు.

ఎవరెవరు ఎప్పుడెప్పుడు గెలిచారు?
1998లో జరిగిన తొలి ఎడిషన్ లో సౌతాఫ్రికా విజేతగా అవతరించింది. 2000లో న్యూజిలాండ్ గెలవగా.. 2002లో శ్రీలంక - టీమిండియా కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్నారు. 2004లో వెస్టిండీస్, 2006, 2009లో ఆస్ట్రేలియా రెండు సార్లు, 2013లో టీమిండియా, 2017లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్నాయి.