దాదాపు 14 నెలల తర్వాత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20 జట్టులోకి రావడంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. వారిద్దరి రీఎంట్రీ సరైన నిర్ణయమే అని అభిప్రాయపడ్డాడు. జూన్లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్, కోహ్లిని అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో రోహిత్ రనౌటవ్వగా, కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. ఇవాళ ఇండోర్ వేదికగా భారత్-అఫ్గాన్ మధ్య రెండో టీ20 జరగనుంది.
అయితే వారిద్దరి పునరాగమనంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొందరు మాజీలు సమర్థిస్తుంటే, యువకులకు అవకాశాలు ఇవ్వాలని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువీ మాట్లాడుతూ.. ''వారిద్దరు మూడు ఫార్మాట్లను ఆడటం వల్లనే 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చారు. అన్ని ఫార్మాట్లు ఆడుతున్నప్పుడు పని భారం గురించి కూడా ఆలోచించాలి'' అని అన్నాడు.

రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను కెప్టెన్గా ముంబయి ఇండియన్స్ ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. విధేయత గురించి స్పందిస్తూ కొందరు క్రికెటర్లు ముంబయి నిర్ణయాన్ని తప్పుపట్టారు. అయితే కలిసి ఆడుతున్నప్పుడు గొడవలు జరుగుతాయని, రోహిత్, హార్దిక్ మధ్య వివాదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని యువీ సూచించాడు. ముంబయితో పాటు భారత జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న వారిద్దరి మధ్య ఏమైనా ఇగో సమస్యలు ఉంటే, వాటిని పక్కనపెట్టి దేశం కోసం గొప్పగా పోరాడాలని యువరాజ్ సింగ్ అన్నాడు.
''రోహిత్ గొప్ప నాయకుడు. అతడు అయిదు ఐపీఎల్ ట్రోఫీలను సాధించాడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో జట్టును ఫైనల్కు చేర్చాడు. ఐపీఎల్, టీమిండియా అత్యుత్తమ సారథుల్లో రోహిత్ ఒకరు. అయితే అతడి వర్క్లోడ్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఇక ఆటగాళ్లు కలిసి ఆడుతున్నప్పుడు గొడవలు జరుగుతుంటాయి. అయితే హార్దిక్-రోహిత్ మధ్య సమస్య ఉంటే దాని గురించి వారు కూర్చొని తప్పక మాట్లాడుకోవాలి''
''ముంబయి ఇండియన్స్ తరపున హార్దిక్ తన అత్యుత్తమ ప్రదర్శన చేయడంలో రోహిత్ పాత్ర కీలకం. హార్దిక్ పనిభారాన్ని తగ్గించడానికి ముఖ్యంగా బౌలింగ్ విషయంలో రోహిత్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. మరోవైపు హార్దిక్ మంచి ఫినిషర్. గుజరాత్ తరపున నాలుగో స్థానంలో ఆడి గొప్పగా రాణించాడు. అయితే వారిద్దరి మధ్య ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. టీమిండియాలో ఆడుతున్నప్పుడు సమస్యలు రావని భావిస్తున్నా. అయితే దేశం తరపున ఆడుతున్నప్పుడు మిగిలిన విషయాల్ని పక్కనపెట్టి వారిద్దరు అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలి'' అని యువరాజ్ అన్నాడు.