టీ20ల రాకతో టెస్టులకు ఆదరణ తగ్గుతుందని, అభిమానులను తిరిగి సుదీర్ఘ ఫార్మాట్ పై ఆసక్తి పెంచేలా డే/నైట్ టెస్టులు తీసుకువచ్చారు. సాధారణంగా ఉపయోగించే రెడ్ బాల్ కు బదులుగా పింక్ బాల్ డే/నైట్ టెస్టులో ఉపయోగిస్తారు. అయితే ఇటీవల పింక్ బాల్ టెస్టులు ఎక్కువగా జరగట్లేదు. దీనిపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు.
''పింక్ బాల్ టెస్టులకు ఆదరణ పెరిగేలా ఏర్పాట్లు చేస్తాం. అయితే గత పింక్ బాల్ టెస్టులను పరిశీలిస్తే మ్యాచ్ లు అన్ని రెండు మూడు రోజుల్లోనే ముగిశాయి. అందరూ నాలుగు అయిదు రోజుల పాటు జరిగే టెస్టును కోరుకుంటారు. అలా పోటీ ఉండే స్థితిలో డే/నైట్ టెస్టులు మరిన్ని నిర్వహిస్తాం. చివరిసారిగా ఆస్ట్రేలియాలో పింక్ బాల్ టెస్టులు నిర్వహించారు. దాని గురించి ఇంగ్లాండ్ తో చర్చలు జరుపుతున్నాం''అని జై షా పేర్కొన్నాడు.

వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ భారత్ పర్యటనకు రానుంది. జనవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు అయిదు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో పింక్ బాల్ టెస్టు గురించి ఇంగ్లాండ్ బోర్డుతో చర్చిస్తామని జైషా వివరించాడు. ఇప్పటివరకు టీమిండియా పింక్ బాల్ టెస్టులు నాలుగు ఆడింది. వాటిలో మూడు విజయం సాధించగా, ఒక్క మ్యాచ్ లో ఓటమిపాలైంది.
చివరిగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఇది మూడు రోజుల్లోనే ఫలితం వచ్చింది. మరోవైపు టీమిండియా ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాతో ఒక పింక్ బాల్ టెస్టు ఆడింది. అది 'డ్రా'గా ముగిసింది. కాగా, ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. రేపు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.