అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమందిరం కల నెరవేరే మధుర క్షణాలు మరికొన్ని గంటల్లోనే సాకారం కాబోతున్నాయి. అయితే సోమవారం జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి ప్రముఖ క్రీడాకారులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించింది.
ఈ వేడుకకు దిగ్గజ క్రికెటర్లతో పాటు ప్రస్తుత ప్లేయర్లుకు ట్రస్టు ఆహ్వానం పలికింది. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్లకు ఆహ్వానం అందింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్ను స్వాగతించారు.

అయితే ఆహ్వానం దక్కిన ప్లేయర్లను 'అయోధ్య జట్టు'గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. వారిలో తుది జట్టును ప్రకటిస్తూ పోస్టులు పెడుతున్నారు. అవాస్తవమైన ఈ తుది జట్టులో ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్తో సునీల్ గవాస్కర్, వన్డౌన్లో విరాట్ కోహ్లి బరిలోకి దిగుతున్నారు. నాలుగు, అయిదు, ఆరో స్థానాల్లో గంగూలీ, రోహిత్ శర్మ, కపిల్ దేవ్ స్థానం దక్కించుకున్నారు.
వికెట్ కీపర్గా రాహుల్ ద్రవిడ్ను ఎంపిక చేశారు. కెప్టెన్సీ బాధ్యతలు ధోనీకి ఇచ్చారు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి ఎంపికయ్యారు. అయితే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఎక్కువగా బ్యాటర్లకే ఆహ్వానం పలికిందని, దీంతో పార్ట్ టైమ్ బౌలర్లుగా బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయాలని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. బ్యాటర్లు ఎక్కువగా ఉండటంతో సెహ్వాగ్, గంభీర్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారని వివరించారు.
కాగా, దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు 10 వేల మందికి పైగా ప్రముఖులకు రామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర హీరోలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. మెగా స్టార్ చిరంజీవితో పాటు అతని తనయుడు రామ్ చరణ్, ప్రభాస్, మోహన్ బాబు, అక్కినేని నాగర్జున వంటి పలువురు హీరోలకు అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలిరావొచ్చని రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తోంది.