
ప్రస్తుత టీమిండియా సమతూకంతో ఉంది
'ప్రస్తుత టీమిండియా మంచి సమతూకంతో ఉంది. 8-9వ నెంబర్ వరకూ బ్యాటింగ్ పటిష్ఠంగా ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా మెరుగ్గా బౌలింగ్ చేయగల బౌలర్లున్నారు. అందుకే.. ఓ స్పెషల్ ఆటగాడి కెప్టెన్సీలోని ఈ జట్టు మరీమరీ ప్రత్యేకమైనది' అని కోహ్లీసేనపై సన్నీ ప్రశంసల వర్షం కురిపించాడు.

3-0తో సిరిస్ కైవసం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ను 3-0తో మరో రెండు వన్డేలు మిగిలుండగానే భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాపై టీమిండియా ఈ విధంగా నెగ్గడం ఇదే తొలిసారి. మూడో వన్డేలో ఆసీస్పై విజయం సాధించి వన్డేల్లో భారత్ అగ్రస్ధానానికి చేరుకుంది.

శ్రీలంక బలమైన జట్టు కాదన్నది నిజం
ఈ నేపథ్యంలో బలహీనంగా ఉన్న శ్రీలంక జట్టు బలమైన భారత్ ముందు మరీ బలహీనంగా కనిపించిందా? అన్న ప్రశ్నకు గవాస్కర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘శ్రీలంక బలమైన జట్టు కాదన్నది నిజం. కానీ ఆస్ట్రేలియాలా అనుభవం కలిగిన జట్టే. కాకపోతే హేడెన్, గిల్క్రిస్ట్, పాంటింగ్, క్లార్క్, హస్సీలాంటి హేమాహేమీలున్న జట్టు కాకపోవచ్చు' అని గవాస్కర్ అన్నాడు.

మ్యాచ్ గతిని మార్చివేసే ఓ బ్యాట్స్మన్, బౌలర్ లేరంతే
'ఆసీస్ మంచి జట్టే. ఆ జట్టు ఏ దశలోనూ పోరాటం ఆపదు. మ్యాచ్ గతిని మార్చివేసే ఓ బ్యాట్స్మన్, మరో బౌలర్ లేకపోవడమే ప్రస్తుత జట్టులో లోటు. ఇక ఇండియాను చూడండి. అలవోకగా ఆడేస్తోంది. వాస్తవంగా ఆసీస్తో మూడు వన్డేల్లోనూ భారత్ ఒత్తిడి ఎదుర్కొంది. కానీ శ్రీలంకతో ఒక్క మ్యాచ్లోనే భారత్కు అలాంటి పరిస్థితి ఎదురైంది' అని అన్నాడు.

ఒత్తిడిని జయించిన ధోని, భువనేశ్వర్
'అయితే ధోని, భువనేశ్వర్ ఒత్తిడిని జయించి జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ఇందుకు భిన్నంగా ఆసీస్తో మూడు మ్యాచ్ల్లోనూ ఒత్తిడిని తిప్పికొట్టి అలవోకగా గెలవడం చాంపియన్ జట్టు అనేందుకు నిదర్శనం' అని గవాస్కర్ వివరించాడు. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా నాలుగో వన్డే జరగనుంది.


Click it and Unblock the Notifications