అగార్కర్ ఎంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కిర్మాణి
ధోనిపై చేసిన వ్యాఖ్యలకు గాను తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ధోనీ గురించి మాట్లాడేందుకు అగార్కర్ ఎంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సయ్యద్ కిర్మాణి తాజాగా ఓ ఇంటర్నెట్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో 'ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడంలేదు. ధోని దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు' అని అన్నాడు.
భారత క్రికెట్కు ధోని నిజమైన సేవకుడు
'భారత క్రికెట్కు ధోని నిజమైన సేవకుడు. యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తి. టీమిండియాలో ధోని లాంటి అనుభవజ్ఞుడు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే టెస్టులకు గుడ్బై చెప్పి పూర్తి బాధ్యతను కోహ్లీకి అప్పగించాడు. ధోనీ ఎప్పుడైనా సరైన నిర్ణయమే తీసుకుంటాడు. అతని రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతనికే వదిలేయండి' కిర్మాణి అన్నాడు.
ఒకట్రెండు మ్యాచ్ల్లో విఫలమైతే ఇలా మాట్లాడతారా?
'ఒకట్రెండు మ్యాచ్ల్లో విఫలమైతే ధోని రిటైర్మెంట్ తీసుకోవాలంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ కరెక్ట్. ఒకప్పుడు దేశం తరఫున ఆడి ఇప్పుడు రిటైరైన వారు ఇలా మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ధోని ముందు అగార్కర్ ఎంత. ధోనిని అగార్కర్ విమర్శించడం వెనుక కారణమేమిటో అర్ధం కావడం లేదు' కిర్మాణి తెలిపాడు.
ఎప్పుడు తప్పుకోవాలో ధోనికి తెలుసు
ఎప్పుడు తప్పుకోవాలో ధోనికి తెలుసు. ధోని గురించి అలా మాట్లాడేందుకు అగార్కర్ ఎవరు?. ఇకనైనా అతని గురించి మాట్లాడటం ఆపండి' అని సయ్యద్ కిర్మాణి ప్రశ్నించారు.