ప్రేమ.. పదం ఒక్కటే అయినా, అది ప్రతిఒక్కరి జీవితంలో ఓ అందమైన మధుర స్మృతి. ముఖ్యంగా అబ్బాయిలకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేసేందుకైనా సిద్ధమైపోతారు, ఎక్కడిదాకా అయినా వెళ్తారు, అవసరమైతే తమ జీవితాన్నే రిస్క్ లో పెట్టడానికైనా వెనకాడరు. దీనికి మన క్రికెటర్లేమీ అతీతం ఏమీ కాదు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ లో బోలెడన్నీ లవ్ స్టోరీలు ఉన్న సంగతి తెలిసిందే. లెజండరీ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - షర్మిలా ఠాగూర్ నుంచి గంగూలీ, సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ ఇలా ఇప్పటివరకు ఎన్నో ప్రేమ కథలు మూడుముళ్ల బంధాలుగా మారి ఆదర్శంగా నిలిచాయి.
అయితే మోస్ట్ రొమాంటిక్, క్లాసిక్ ప్రేమ కథలున్నా ఎన్ని ఉన్నా, క్రికెటర్ మహాలింగమ్ వెంకటేశన్ (మలి) ప్రేమ కథ వాటికి మించినది అని పోలుస్తుంటారు క్రికెట్ అభిమానులు. మలి తన ప్రేమ కోసం అప్పట్లోనే కెరీర్ ను రిస్క్ లో పెట్టి, నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా దేశం దాటి వెళ్లాడు. అప్పుడు అతడు తీసుకున్న రిస్క్ తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఫైనల్ గా అతడు చేసిన రిస్క్ వల్ల లవ్ లైఫ్ లో సక్సెస్ అయ్యాడు కానీ, ప్రొఫెషనల్ కెరీర్ ను గట్టిగా దెబ్బతీసింది. దీంతో అతడు క్రికెట్ లో బ్యాన్ కూడా అయ్యాడు. ప్రస్తుతం అతడు క్రికెట్ ఆటకపోయినప్పటికీ మిలియనీర్ అయ్యాడు. ఇప్పుడు అతడు చెన్నై సూపర్ కింగ్స్ కు చిరకాల అతిథి అతడు కూడా.

తాజాగా మలి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ కథతో పాటు సీఎస్కేతో ఉన్న అనుబంధం గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా, మలి.. 1970-80లో టీమిండియా రీజనల్, డొమాస్టిక్ క్రికెట్ ఆడి మంచి పేరు సంపాదించుకున్నాడు. చెన్నై ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడి ఎన్నో ఘనతలు అందుకున్నాడు. స్టార్ ప్లేయర్స్ సయ్యద్ కిర్మాణీ, క్రిస్ శ్రీకాంత్ వంటి ప్లేయర్స్ తో కలిసి మైదానంలో క్రికెట్ ఆడాడు.
"నా భార్య ప్రిసిల్లా (Priscilla) సౌతాఫ్రికన్ ఇండియన్. ఆమె 1983లో ఇండియాకు వచ్చిప్పుడు కలిశాను. తర్వాత ఆమె తన స్వదేశానికి వెళ్లిపోయింది. అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను. ఆమెను ఎలాగైనా కలవాలని బలంగా అనుకున్నాను. దీంతో సౌతాఫ్రికా ఎలా వెళ్లాలా అని ఎన్నో దారులు వెతికాను. ఎందుకంటే అప్పట్లో దక్షిణాఫ్రికాకు ప్రయాణం చేయడం అంతే ఈజీ కాదు. కానీ నాకు భారత ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్ వచ్చింది. ఇక నేను అక్కడికి వెళ్లాను. నాకు సౌతాఫ్రికాలో ఓ దూరపు బంధువు ఉన్నారని ప్రత్యేక పర్మిషన్ అడిగి, ఆమెను కలవడానికి వెళ్లాను. అప్పుడు కేవలం పేపర్ వీసాలు మాత్రమే ఉన్నాయి. ఇక నేను డర్బన్ లో ల్యాండ్ అయ్యాక.. ఆమెను కలవడానికి పిలిచాను. ఆమె మొదట నమ్మలేదు. నేను అబద్ధం చెబుతున్నాను అనుకుంది. ఆమె వర్క్ ప్లేస్ కు నేను వెళ్లాక నమ్మింది. ఇండియా నుంచి నీకోసమే వచ్చాను అని చెప్పాను. అలా ఆ తర్వాత మా పరిచయం సాగి పెళ్లి చేసుకున్నాం. 38 ఏళ్ల నుంచి కలిసి జీవిస్తున్నాం." అని చెప్పుకొచ్చాడు మలీ.
అయితే సౌతాఫ్రికాలో తన ప్రేమించిన అమ్మాయిని కలుసుకున్న మలి, తిరిగి క్రికెట్ కూడా ఆడాలనుకున్నాడు. కానీ ప్రేమించిన అమ్మాయి వదిలి రాలేక అక్కడే ఉండి ఓ లోకల్ టీమ్ లో జాయిన్ అయిపోయాడు. డర్బన్ ఏ డివిజన్ లీగ్ లో పాస్టోరల్స్ అనే జట్టు తరఫున రెండు లీగ్ మ్యాచులు ఆడాడు. మహలింగమ్ మురళి పేరుతో అక్కడ కొనసాగాడు. అయితే తన వీసా గడువు ముగిసి చిక్కులో పడ్డాడు. ఈ క్రమంలోనే ఈ విషయం ఇండియాలో తెలిసింది. దీంతో వెంటనే అతడు భారత్ కు తిరిగి రావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సౌతాఫ్రికా అతడిని అక్కడ బ్యాన్ చేసింది.
ఇక ఇండియాకు తిరిగొచ్చిన మలికి ఇక్కడ కూడా ప్రశ్నలు బాగా ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే అనుకోని దెబ్బ తగిలింది. అతడు తీవ్రంగా గాయపడి సర్జరీ కూడా చేయించుకున్నాడు. దీంతో ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు. ఆ తర్వాత అతడు రెస్టారెంట్ బిజినెస్ పెట్టి బాగా సంపాదించి సౌతాఫ్రికాలోనే తన భార్యతో సెటిల్ అయిపోయాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కు చిరకాల అతిథి
చెన్నై సూపర్ కింగ్స్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు మలి. ఎన్ శ్రీనివాసన్, కాశీ విశ్వనాథన్ తనకు బాగా దగ్గరివారని అన్నాడు. గతంలో శ్రీనివాసన్ తన గురించి ఏం అన్నారో చెప్పుకొచ్చాడు. "కాశీ, మలి నాకు ఎప్పటికీ చిరకాల అతిథులు అని శ్రీనివాసన్ నాతో అన్నాడు. సీఎస్కే మ్యాచులు ఇండియాలో ఎక్కడ జరిగినా.. నాకు నా భార్యకు ఫ్రీ టికెట్, ఫ్రీ ట్రిప్స్ స్పాన్సర్స్ చేస్తుంటారు. SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కు పబ్లిక్ ఆఫీసర్ గా నియమించారు" అని చెప్పుకొచ్చాడు.