
హైదరాబాద్: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయి అందుకున్నాడు. రికార్డులకు మారు పేరైన సచిన్ టెండూల్కర్ ఎవరికి సాధ్యంకాని విధంగా తన 50వ టెస్టు సెంచరీని 2010 డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాపై సాధించాడు.
దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సచిన్ టెండూల్కర్ (111) సెంచరీ చేసి టెస్టుల్లో 50 సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన రికార్డుని నెలకొల్పి ఏడేళ్లు అయినప్పటికీ, ఇప్పటివరకు ఈ రికార్డుని ఎవరూ అధిగమించలేకపోవడం విశేషం.
అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో టెస్టులో 87 పరుగులతో భారత్ గెలవడంతో సిరీస్ సమమైంది. ఇక, కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సచిన్ మరో సెంచరీ (146) రాణించడంతో మ్యాచ్ డ్రా అయి భారత్ సిరీస్ను కాపాడుకోగలిగింది.
కాగా భారత్ తరుపున అన్ని ఫార్మట్లలో కలిపి సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులు నమోదు చేశాడు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు.. 463 వన్డేల్లో 18,426 పరుగులు చేసిన సచిన్, భారత్ తరుపున ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. ఇందులో 10 పరుగులు చేశాడు.
వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అరుదైన ఘనత సాధించాడు. ఫిబ్రవరి 24, 2010లో గ్వాలియర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్ 147 బంతుల్లో 200 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతేకాదు అన్ని ఫార్మట్లలో కలిపి 100 సెంచరీలు (వన్డేల్లో 49, టెస్టుల్లో 51) నమోదు చేశాడు.
సచిన్ తన చివరి మ్యాచ్ను 2013లో వెస్టిండీస్పై ఆడాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరుపున 78 మ్యాచ్లాడిన సచిన్ 2334 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.