
క్రికెటర్గా సచిన్ పుట్టింది ఈరోజే
సచిన్ తన అరంగేట్ర మ్యాచ్ని భారత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్పై ఆడాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలోని భారత జట్టులో 16 ఏళ్ల యువ సచిన్ చోటు దక్కించుకున్నాడు. కరాచీ వేదికగా నవంబర్ 15న జరిగిన తొలి టెస్టులో సచిన్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో మనోజ్ ప్రభాకర్ స్ధానంలో సచిన్ బరిలోకి దిగాడు. అంతేకాదు ఈ టెస్టుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. పాకిస్థాన్ ఆల్ టైమ్ బౌలింగ్ దిగ్గజాల్లో ఒకడైన వకార్ యూనిస్ కూడా ఇదే మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ పాకిస్థాన్ 409 పరుగులు చేసింది.

24 బంతులాడి కేవలం 15 పరుగులు
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 109 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 262 పరుగులే చేసింది. 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో సచిన్ క్రీజులోకి అడుగు పెట్టాడు. 24 బంతులాడి కేవలం 15 పరుగులు చేశాడు. ఇందులో రెండు కవర్డ్రైవ్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో వకార్ యూనిస్ క్లీన్బౌల్డ్ చేయడంతో సచిన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవిశాస్త్రి (45), కపిల్దేవ్ (55), కిరణ్మోరె (58) నెమ్మదిగా ఆడి జట్టును ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించారు

రెండో ఇన్నింగ్స్లో సచిన్కు బ్యాటింగ్ రాలేదు
ఇక, రెండో ఇన్నింగ్స్ను పాకిస్థాన్ 305/5 వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సచిన్కు బ్యాటింగ్ రాలేదు. సంజయ్ మంజ్రేకర్ (113), నవ్జ్యోత్ సింగ్ సిద్ధు (85)లు ఐదు సెషన్ల పాటు ఆడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 303/3 పరుగులు చేసింది. అదే పాకిస్థాన్పై ఫైసలాబాద్లో జరిగిన రెండో టెస్టులో సచిన్ హాఫ్ సెంచరీని నమోదు చేసాడు. 172 బంతుల్లో సచిన్ 59 పరుగులు నమోదు చేశాడు. ముఖ్యంగా పాక్ దిగ్గజ బౌలర్లు వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్లను సచిన్ ఎదుర్కొన్న తీరు అద్భుతం.

భారత్ తరుపున 200 టెస్టులాడిన సచిన్ 15,921 పరుగులు
ఈ సిరిస్ అనంతరం 1990ల్లో అజారుద్దీన్ జట్టులో సచిన్ కీలక సభ్యుడిగా మారిపోయాడు. 17 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియాపై తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. అంతేకాదు ఈ టెస్టు సెంచరీతో భారత్ను ఓటమి నుంచి తప్పించాడు. ఇలా 25 ఏళ్ల వయసు వచ్చే సరికి సచిన్ ఖాతాలో మొత్తం 16 టెస్టు సెంచరీలు చేరాయి. అలా మొత్తం తన కెరీర్లో 200 టెస్టులాడిన సచిన్ 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications