
హైదరాబాద్: విరాట్ కోహ్లీతో పాటుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా క్రికెట్ ఆడటానికి వెళ్లిందా? వారి సతీమణులతో హనీమూన్ చేసుకోవడానికా అంటూ విమర్శలు సంధిస్తున్నారు. అయితే వారి ఆగ్రహానికి బీసీసీఐ షేర్ చేసిన ఓ ఫొటోనే కారణం. మంగళవారం టీమిండియా ఆటగాళ్లు లండన్లో భారత హై కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ కూడా ఉంది. మ్యాచింగ్ డ్రెస్ కోడ్తో హాజరైన ఆటగాళ్ల మధ్యలో అనుష్క భారత సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. ఇదే అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. జట్టు అధికారిక మీట్కు అనుష్క హాజరు కావడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
'భారత వైస్ కెప్టెన్ చివర నిలబడితే.. టీమిండియా ఫస్ట్ లేడీ మాత్రం ముందు నిలబడింది. వీళ్లే కొద్ది రోజుల క్రితం ఆన్లైన్ వేదికగా నీతి సూక్తులు బోధించారు'
అంటూ ఒకరు సెటైర్ వేయగా.. 'బీసీసీఐ అధికారిక టూర్కు కొందరి భార్యలను ఎందుకు అనుమతించింది.. వారు ఆట ఆడటానికి వెళ్లారా లేక హనీమూన్కా?' అని ఇంకొకరు ప్రశ్నించారు.
అదొక టీమ్ ఈవెంట్ అని, ఫ్యామిలీ ఫంక్షన్ కాదని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక తొలి టెస్టులో ఓడిన కోహ్లిసేన రెండో టెస్టుకు సిద్దమైంది. గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది.