వణికించిన స్పిన్నర్లు..
ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో బ్యాటు, బంతి మధ్య గట్టి పోటీనే నిలిచింది. అయితే పిచ్ నుంచి బౌలర్లకే ఎక్కువ సహకారం లభించింది. ఈ మ్యాచ్లో కివీస్ బౌలర్ల ధాటికి తడబడిన భారత బ్యాటింగ్ లైనప్.. లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. దీంతో న్యూజిల్యాండ్ జట్టు 21 పరుగుల తేడాతో తొలి మ్యాచ్ గెలిచి సిరీస్లో ఆధిక్యం సాధించింది. ఇక రెండో మ్యాచ్ జరిగిన లక్నో పిచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పిచ్పై స్పిన్నర్లు రాజ్యమేలారు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ముగ్గురూ కివీస్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు.
భారత బ్యాటర్లు కూడా..
భారత స్పిన్నర్ల ధాటికి తడబడిన ఆ జట్టు కేవలం 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా సునాయాసంగా గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ కివీస్ బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. వరుస విరామాల్లో వికెట్లు కూడా తీసుకున్నారు. అయితే దీనికి అడ్డుకట్ట వేసిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఎంతో పరిణితితో ఆడి మరో వికెట్ పడనీయలేదు. దీంతో ఎట్టకేలకు మరో బంతి మిగిలుండగా భారత్ గెలిచింది. 99 పరుగులు ఛేదించడానికి కూడా 19.5 ఓవర్లు పట్టిందంటేనే కివీస్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విజయంతో సిరీస్ 1-1తో సమమైంది.
మొదటి సిరీస్ కోసం కివీస్..
అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టుకు సిరీస్ దక్కుతుంది. ఇప్పటి వరకు భారత గడ్డపై న్యూజిల్యాండ్ జట్టు ఒక్క టీ20 సిరీస్ కూడా నెగ్గలేదు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలని శాంట్నర్ అండ్ కో భావిస్తున్నారు. ఈ సిరీస్లో శాంట్నర్ కెప్టెన్సీ కూడా అందరనీ ఆకట్టుకుంది. చాలా ప్రశాంతంగా ఉంటున్న అతను.. తాను అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా, తన బౌలర్లను కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మరి మూడో టీ20లో నెగ్గి సిరీస్ ఎవరు గెలుచుకుంటారో చూడాలి.