
బెంగళూరు: భారత క్రికెట్పై కరోనా వైరస్ మహమ్మారి అసలు ప్రభావం అక్టోబర్లో కనిపిస్తుంది అని భారత మాజీ కెప్టెన్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. భారత దేశం ప్రస్తుతం కరోనా వైరస్తో సతమతమవుతోంది. రోజుకు వేలాది కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. క్రీడాకారులపై మాత్రం ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకు కారణం దేశంలో మార్చి నుంచే లాక్డౌన్ విధించడంతో అందరు ఆటగాళ్లూ ఇంటికే పరిమితమయ్యారు.
భారత ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి దగ్గరలోని మైదానాల్లో తిరిగి సాధన మొదలుపెడుతున్నారు. త్వరలోనే ఐపీఎల్ 2020, దేశవాళి క్రికెట్ ఆరంభం కానుంది. దీంతో ఆటగాలు అందరూ మైదానాలకు చేరుకోనున్నారు. ఇదే విషయంపై ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. డెక్కన్ హెరాల్డ్తో ద్రవిడ్ మాట్లాడుతూ... 'ప్రస్తుతానికైతే ఆటగాళ్లు సురక్షితంగానే ఉన్నారు. ఇప్పటివరకు మేం అదృష్టవంతులం. అక్టోబర్లో దేశవాళి క్రికెట్ తిరిగి ప్రారంభమైనప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది' అని మాజీ కెప్టెన్ చెప్పారు.
'ప్రస్తుతం పలు అంతర్జాతీయ టోర్నీలు రద్దయ్యాయి, మరికొన్ని వాయిదా పడ్డాయి. వాటిని మళ్లీ నిర్వహించడానికి సమయం దొరుకుతుంది. అక్టోబర్లో మాత్రం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అప్పుడే దేశీయ సీజన్ కోసం మన యువ క్రీడాకారులు ఆడడం ప్రారంభిస్తారు. జూనియర్లు, అండర్ -16, అండర్ -19 మరియు మహిళా క్రికెటర్లు క్రికెట్ ఆడుతారు. అప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనపోతే పరిస్థితి చాలా దూరం వెళుతుంది' అని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. 19 సంవత్సరాల చివరలో, 23-24 సంవత్సరాల వయస్సులో ఉన్నవారికి ఈ దేశీయ సీజన్ చాలా ముఖ్యమైనది ఆయన చెప్పారు.
గత నెల ప్రారంభంలో ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య 3 టెస్టులతో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమైంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బయో బబుల్ వాతావరణంలో ఆ టెస్ట్ సిరీస్ను విజయవంతంగా పూర్తిచేసింది. ఇప్పుడు ఐర్లాండ్ జట్టుతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఆడుతుంది. ఆపై పాకిస్తాన్తో రెండు ఫార్మాట్లలో అదే ఇంగ్లీష్ జట్టు ఆడుతుంది. ఈసీబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సిరీస్లను నిర్వహిస్తోంది. ఒక్క ఆటగాడు కూడా వైరస్ బారిన పడకుండా చూస్తోంది. నవంబర్ నెలలో కూడా ఐపీఎల్ ఇదే విధానంలో జరుగనుంది.