భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ టీమిండియాకు దూరంగా ఉన్నప్పటికీ.. రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి తాను రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిరూపించుకుంటున్నాడు. రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లలో 15 వికెట్లు తీసి తన ఫిట్నెస్ను నిరూపించుకోవడమే కాకుండా సెలెక్టర్లకు గట్టి సమాధానమిచ్చాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో గుజరాత్తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో మొత్తం 8 వికెట్లు పడగొట్టి బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం టీమిండియాలో ఎంపిక కాకపోవడంపై జరుగుతున్న వివాదంపై షమీ కీలక ప్రకటన చేశాడు.
టీమిండియాలో రీఎంట్రీపై షమీ ఏమన్నాడంటే..
మంగళవారం గుజరాత్పై రెండో ఇన్నింగ్స్లో షమీ 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి, తన జట్టుకు 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందించాడు. మ్యాచ్ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా, షమీ ఇలా అన్నాడు.

"నాకు తెలుసు, ఈ ప్రశ్న వస్తుందని. నేను ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటాను. మీరు నన్ను అప్పటికే విలన్గా మార్చేశారు. దీని గురించి నేను ఇంకేం చెప్పగలను? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని వక్రీకరించి చూపిస్తున్నారు. నా పని కేవలం బాగా ప్రదర్శన ఇవ్వడం, ఫిట్గా ఉండి భారత జట్టు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం. నాకు అవకాశం దొరికినప్పుడల్లా నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. మిగతాదంతా సెలెక్టర్లపై ఆధారపడి ఉంటుంది." అని పేర్కొన్నాడు.
"నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది" - షమీ
షమీ ఇంకా మాట్లాడుతూ.. "ఒక కష్టమైన దశ నుంచి బయటపడి బాగా రాణించడం చాలా సంతోషాన్నిస్తుంది. ప్రపంచ కప్ తర్వాత నా సమయం చాలా కష్టంగా, బాధాకరంగా ఉంది. కానీ ఆ తర్వాత నేను రంజీ ట్రోఫీ, వైట్-బాల్ క్రికెట్, ఐపీఎల్, దులీప్ ట్రోఫీ ఆడాను. ఇప్పుడు నా ఫామ్ మళ్లీ పూర్వ స్థితికి వచ్చింది. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని నేను స్పష్టంగా అనుభూతి చెందుతున్నాను" అని చెప్పాడు.
షమీ అహ్మదాబాద్లో జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత ఏడాదికి పైగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులోకి తిరిగి వచ్చాడు. భారత జట్టు తరఫున చివరి మ్యాచ్ 2025 మార్చి 9న దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. అప్పటి నుంచి మహమ్మద్ షమీ టీమిండియాలోకి తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నాడు.
షమీ 100 శాతం ఫిట్గా ఉన్నాడు..
షమీ చిన్ననాటి కోచ్ మొహమ్మద్ బద్రుద్దీన్ మంగళవారం మాట్లాడుతూ.. షమీ తన ఫామ్ను తిరిగి పొందాడని, పూర్తిగా ఫిట్గా ఉన్నాడని అన్నారు. "అతని ఫామ్ తిరిగి వచ్చింది, అతను 100 శాతం ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. షమీకి ఫామే ముఖ్యం. ఒకసారి అతనికి ఫామ్ దొరికితే, అతను వేరే బౌలర్గా మారిపోతాడు. ఈ రోజు నేను చూసింది పాత షమీని. నాకు ఎటువంటి లోపం కనిపించలేదు" అని కోచ్ వ్యాఖ్యానించాడు.