
విరాట్ కోహ్లీ
గతేడాది కాలంగా టెస్టుల్లో ఫామ్లో లేని ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అయితే ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫామ్ అందుకున్న అతను.. టెస్టుల్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. తాజాగా ఢిల్లీలో అతను ఆడిన ఇన్నింగ్సే దానికి ఉదాహరణ. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన పట్టుదల ప్రదర్శించిన కోహ్లీ.. భారీ స్కోరు చేసేలా కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తూ అంపైర్ ఇచ్చిన వివాదాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు తనకు అచ్చొచ్చిన హోల్కర్ స్టేడియంలో అయినా భారీ స్కోరు చెయ్యాలని కోహ్లీ ఆశిస్తున్నాడు.

స్టీవెన్ స్మిత్
ఆసీస్ బ్యాటింగ్ విభాగం ఎక్కువగా ఆధారపడుతున్న వారిలో స్టీవెన్ స్మిత్ ఒకడు. కానీ అతను తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మినహా ఏమాత్రం రాణించలేదు. ఆ ఇన్నింగ్స్లో కూడా పెద్ద స్కోరు చెయ్యలేదు. ఇక ఢిల్లీలో అయితే తను ఇప్పటి వరకు ఏమాత్రం ఆడని విధంగా స్వీప్ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న స్మిత్కు.. తనపై బాధ్యతలు పెరిగే కొద్దీ రాణించడం అలవాటు. దానికితోడు భారత్లో ఆడటం బాగా తెలిసిన సీనియర్లలో స్మిత్ కూడా ఒకడు. ఈ క్రమంలోనే మూడో టెస్టులో స్మిత్ కూడా భారీ స్కోరు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రోహిత్ శర్మ
ఈ టెస్టు సిరీస్లో అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్న ప్లేయర్ రోహిత్ శర్మ. కఠినమైన నాగ్పూర్ పిచ్పై తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ బాదిన రోహిత్.. ఢిల్లీలో కూడా రాణించాడు. ముఖ్యంగా ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీ20 తరహాలో విరుచుకుపడిన అతను.. చివరకు పుజారా కోసం వికెట్ త్యాగం చేశాడు. లేదంటే ఆ ఇన్నింగ్స్లో కూడా కనీసం హాఫ్ సెంచరీ పూర్తిచేసుకునే వాడే. ఇంత చక్కని ఫామ్లో ఉన్న రోహిత్.. బ్యాటింగ్కు అనుకూలించే హోల్కర్ స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతాడని అభిమానులు భావిస్తున్నారు. దీంతో అతను మరో సెంచరీ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications












