
అక్షర్ అత్యంత వేగంగా..
భారత టెస్టు జట్టులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్. గతేడాది చెన్నైలో తన కెరీర్లో తొలి టెస్టు ఆడిన అతను ఇప్పటి వరకు కేవలం 7 టెస్టు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఈ మ్యాచుల్లో 13 సగటుతో ఇప్పటికే 44 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి టెస్టులో కూడా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
ఇక రెండో టెస్టులో కనుక అతను 6 వికెట్లు తీసుకుంటే.. భారత్ తరఫున అత్యంత వేగంగా 50 టెస్టు వికెట్లు తీసుకున్న బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అతను తన 9వ టెస్టు మ్యాచులో 50వ వికెట్ తీసుకున్నాడు. అక్షర్ గనుక రెండో టెస్టులో ఆరు వికెట్లు తీసుకుంటే.. అశ్విన్ను అధిగమించేస్తాడన్నమాట.

పుజారా మరో మైలురాయి..
భారత జట్టులో 'నయా వాల్'గా పేరొందిన ఛటేశ్వర్ పుజారా.. తనలోనూ దూకుడైన ఆటగాడు ఉన్నాడని తొలి టెస్టులో చూపించాడు. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న ఈ టెస్టు స్పెషలిస్టు మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచిన పుజీ.. ఇప్పటి వరకు మొత్తం 97 టెస్టు మ్యాచుల్లో 44.43 సగటుతో 6984 పరుగులు చేశాడు.
బంగ్లాతో జరిగే రెండో టెస్టులో కనుక అతను మరో 16 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇదే కనుక జరిగితే ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్గా పుజారా రికార్డు సృష్టిస్తాడు. అలాగే అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన ఆరో భారత బ్యాటర్ అవుతాడు.

అడుగు దూరంలో సిరాజ్..
ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్లో ఉన్న పేసర్ ఎవరు? అంటే టక్కున గుర్తొచ్చే పేరు మహమ్మద్ సిరాజ్. తన బౌలింగ్ను చాలా మెరుగు పరుచుకున్న అతను వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్నాడు. బంతితో చక్కగా రాణిస్తూ జట్టు తనపై ఆధారపడగలదు అని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత సాధించడానికి అడుగు దూరంలో నిలిచాడు.
ఈ ఏడాది సిరాజ్ తన అంతర్జాతీయ కెరీర్లో 39 వికెట్లు తీసుకున్నాడు. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఖాతాలో కూడా 39 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. వచ్చే టెస్టులో సిరాజ్ ఒక్క వికెట్ తీసుకున్నా బుమ్రాను దాటేసి ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా సిరాజ్ అరుదైన ఘనత సాధిస్తాడు. మరి రెండో టెస్టులో అతను ఎలా రాణిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications












