వరల్డ్ కప్ ముగిసింది. టోర్నీ ఆసాంతం ప్రత్యర్థులతో ఒక ఆట ఆడుకున్న టీమిండియా.. చివరి ఫైనల్లో తడబడి ట్రోఫీ చేజార్చుకుంది. అయితే ఇది కొందరు ఆటగాళ్లకు వరల్డ్ కప్ అందుకోవడానికి దక్కిన చివరి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మరో వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశం కొందరు ప్లేయర్లకు లేదు. ఈ క్రమంలో వరల్డ్ కప్లో తమ చివరి మ్యాచ్ ఆడేసిన ప్లేయర్లు ఎవరంటే?
సూర్యకుమార్ యాదవ్: సంజూ శాంసన్ వంటి ప్లేయర్లను కూడా పక్కన పెట్టి, సూర్యకుమార్ యాదవ్పై టీమిండియా మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అయితే దీన్ని సూర్య నిలుపుకోలేకపోయాడు. ఈ వరల్డ్ కప్లో పెద్దగా ఏం చేయకుండానే టోర్నీ ముగించాడు. ఏడు మ్యాచుల్లో ఆడిన అతను 17.66 సగటు, 100.95 స్ట్రైక్ రేటుతో కేవలం 106 పరుగులు చేశాడు.

ఇలాంటి ప్రదర్శన తర్వాత అతన్ని మళ్లీ వన్డే టీంలోకి తీసుకుంటారని అనుకోవడం అతిశయోక్తి అవుతుంది. దానికితోడు సూర్య వయసు కూడా 33 సంవత్సరాలు. దీంతో అతను మరో వరల్డ్ కప్ ఆడటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
రవిచంద్రన్ అశ్విన్: ఈ వరల్డ్ కప్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే అశ్విన్ ఆడాడు. చాలా మంది ఈ టోర్నీ ఫైనల్లో అశ్విన్ ఆడతాడని అనుకున్నారు. కానీ అతన్ని టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. కుల్దీప్ యాదవ్కే మొగ్గు చూపింది. కానీ కుల్దీప్ ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.
ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన అశ్విన్.. ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్కు ఇప్పుడు 37 ఏళ్ల వయసు. మరో వన్డే వరల్డ్ కప్ వచ్చే సరికి అతనికి 41 ఏళ్లు వచ్చేస్తాయి. కాబట్టి 2027 వరల్డ్ కప్ ప్లాన్స్లో అశ్విన్కు ఎలాంటి పాత్ర ఉండదనే చెప్పాలి.
రోహిత్ శర్మ: ఈ వరల్డ్ కప్లో టీమిండియాను ముందుండి నడిపించిన రోహిత్ శర్మ.. మరో వన్డే వరల్డ్ కప్ ఆడటం అసాధ్యమనే చెప్పాలి. 2011లో వరల్డ్ కప్ నెగ్గిన టీంలో రోహిత్ లేడు. ఆ తర్వాత మూడుసార్లు ట్రోఫీ కోసం ప్రయత్నించినా రోహిత్కు అది అందని ద్రాక్షలానే మిగిలింది. ఈ వరల్డ్ కప్లో అద్భుత ఫామ్ కనబరిచిన రోహిత్.. 54.27 సగటు, 125.94 స్ట్రైక్ రేటుతో 597 పరుగులు చేశాడు.
అయితే రోహిత్ వయసు కూడా 37 సంవత్సరాలకు దగ్గర పడింది. కాబట్టి ఏదో అద్భుతం జరిగితే తప్ప.. మరో వరల్డ్ కప్లో రోహిత్ ఆడటం అనుమానమే. కాబట్టి ఈ వరల్డ్ కప్ ఫైనలే రోహిత్ కెరీర్లో చివరి వన్డే వరల్డ్ కప్ అని చెప్పాలి.