
కీలక ఆటగాళ్ల ఫామ్
టీమిండియాలో కీలక ఆటగాళ్లు ఫామ్ లేక సతమతం అవుతున్నారు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఈ టెస్టులకు ఎంపికైన ఆటగాళ్లు కూడా ఫామ్ అందుకున్నారా? అనేది అనుమానమే. చాలా కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించినా ఫామ్ సాధించడం కష్టంగా కనిపిస్తోంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో లేడు. రోహిత్ శర్మ కూడా చాలా కాలంగా టెస్టులు ఆడలేదు. దీంతో వీళ్లందరూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తారని చెప్పలేం.

కోహ్లీపై భారం
టీమిండియా మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్ తొలి రెండు మ్యాచులు ఆడటం అనుమానంగా మారింది. వెన్నునొప్పితో బాధ పడుతున్న అయ్యర్ ఈ టెస్టులు ఆడటంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే అతను కనుక జట్టుకు దూరమైతే.. టెస్టుల్లో ఫామ్ అందుకోని కోహ్లీపై మరింత భారం పడుతుంది. మూడేళ్లపైగా టెస్టుల్లో సరైన ఫామ్లో లేని కోహ్లీ.. ఈ సిరీస్లో భారత జట్టుకు చాలా కీలకంగా మారనున్నాడు. అతను ఫామ్ అందుకుంటే ఓకే కానీ.. లేదంటే భారత మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉంటుంది.

పంత్ లేని లోటు
టెస్టుల్లో టీమిండియా విజయాల్లో యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ చాలా కీలకమైన పాత్ర పోషించేవాడు. అయితే యాక్సిడెంట్ కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. దీంతో మిడిలార్డర్లో కీలకమైన డ్యాషింగ్ బ్యాటర్ లేని లోటు భారత జట్టుపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. అలాగే పంత్ అంత అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసే ఆటగాళ్లు కూడా లేరు.
కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఇద్దరూ మంచి ఆటగాళ్లే అయినా కూడా.. ఇప్పటి వరకు ఇద్దరూ ఇప్పటి వరకు అరంగేట్రం చేయలేదు. దీంతో ఇద్దరి వద్ద అనుభవం లేదు. దీన్ని ఆస్ట్రేలియా జట్టు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది కచ్చితంగా భారత విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications
