
రోహిత్ ఎమోషనల్ సెలబ్రేషన్
ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ మునుపటిలా మంచి టచ్లో కనిపించాడు. చూడచక్కని షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. లంక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఆకాశం వైపు చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. తన పెంపుడు కుక్క మ్యాజిక్కు దీన్ని అతను డెడికేట్ చేసినట్లు కనిపించింది.
పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ కుక్కపిల్ల.. సరిగ్గా ఈ మ్యాచ్ ముందురోజే కన్నుమూసింది. ఈ క్రమంలోనే రోహిత్ తన హాఫ్ సెంచరీని మ్యాజిక్కు డెడికేట్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు.

కోహ్లీ వింటేజ్ సెలబ్రేషన్
కొన్నిరోజుల క్రితం వరకు కోహ్లీ ఫామ్లో లేడని, సరిగా ఆడటం లేదని, సెంచరీలు చేయడం లేదని తెగ విమర్శలు వచ్చాయి. అయితే నెలరోజుల విశ్రాంతి తరువాత మళ్లీ అతని ఇంజిన్ గాడిలో పడింది. గతేడాది చివరగా బంగ్లాదేశ్పై సెంచరీ చేసిన అతను.. ఈ ఏడాదిని శ్రీలంకపై సెంచరీతో ప్రారంభించాడు.
ఈ సెంచరీ పూర్తవగానే కోహ్లీ గాల్లోకి ఎగురుతూ ఎనర్జిటిక్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన వాళ్లందరికీ ఒకప్పటి యంగ్ కోహ్లీ గుర్తొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ నెట్టింట ఇదే విషయాన్ని వైరల్ చేశారు. 'మళ్లీ మునుపటి కోహ్లీ వచ్చేశాడు' అంటూ అతని పేరును తెగ ట్రెండ్ చేశారు.

క్రీడాస్ఫూర్తి అంటే ఇదే..
శ్రీలంక ఛేజింగ్లో చివరి ఓవర్లో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. అప్పటికి దాసున్ షనక 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. షమీ బౌలింగ్ చేసిన చివరి ఓవర్ మూడో బంతికి అతను నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. అప్పుడు బౌలింగ్ చేయడానికి వచ్చిన షమీ.. అతను క్రీజు దాటి వెళ్లిపోవడం చూసి నాన్స్ట్రైకర్ ఎండ్లో వికెట్లను కూల్చాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఇలాంటి అవుట్లు సాధారణంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ అవుట్ కోసం అప్పీల్ చేస్తే అంపైర్ కూడా టీమిండియాకు అనుకూలంగానే నిర్ణయం తీసుకునేవాడు. కానీ రోహిత్ ఆ పని చేయలేదు. తమ అప్పీల్ను వాపస్ తీసుకున్నాడు. ఆ తర్వాత స్ట్రైకింగ్కు వెళ్లిన షనక తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్కు ధన్యవాదాలు తెలిపాడు. లంక లెజెండ్ సనత్ జయసూర్య కూడా సోషల్ మీడియా వేదికగా రోహిత్ నిజమైన క్రీడాస్ఫూర్తిని చాటాడని మెచ్చుకున్నాడు.


Click it and Unblock the Notifications












