శ్రేయాస్ అయ్యర్
అప్పుడే డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. ఒక పక్క క్రీజులో సెట్ అయిన కోహ్లీ ఉన్నాడు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. తను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. బంగ్లా బౌలర్లు తనను టార్గెట్ చేస్తూ వేసిన బంతులకు చిరాకు పడిపోయి అనవసరమైన షాట్కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంగ్లా సారధి లిటాన్ దాస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది వన్డే క్రికెట్లో అదరగొడుతున్న అతను.. ఈ మ్యాచ్లో కూడా రాణించి తన గణాంకాలు మెరుగు పరుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన అయ్యర్.. ఈ మ్యాచ్లో కూడా రాణించి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
కేఎల్ రాహుల్
రోహిత్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు అందుకున్న రాహుల్కు మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం వచ్చింది. కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోయిన రాహుల్ కేవలం 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతను రెండో మ్యాచ్లో కూడా రాణించలేదు. ఈ మ్యాచ్లో రాణించి తనపై జట్టు నమ్మకాన్ని నిరూపించుకోవాల్సిన అతను.. దీనిలో కూడా విఫలమయ్యాడు. ఎబాదత్ హొస్సేన్ వేసిన యార్కర్కు పెవిలియన్ చేరాడు. తనపై జట్టు నమ్మకం పెట్టుకోవచ్చని నిరూపించుకునే చక్కని అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే మిగతా ఆటగాళ్లు రాణించడంతో రాహుల్ వైఫల్యం మరుగునపడిపోయింది.
శిఖర్ ధవన్
బంగ్లా పర్యటనలో మూడు వన్డేల్లోనూ ధవన్ విఫలమయ్యాడు. మూడింటిలోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. పరువు కోసమైనా మూడో వన్డేలో టీమిండియా గెలవాల్సిన స్థితిలో కూడా ధవన్ బాధ్యతాయుతంగా ఆడలేకపోయాడు. కేవలం మూడు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇంత దారుణంగా విఫలమైన ధవన్ను ఇంకా కొనసాగించి, వన్డే వరల్డ్ కప్లో ఆడిస్తారా? లేదా అనేది చూడాలి. ఫ్యాన్స్ అయితే ధవన్ను విపరీతంగా ట్రోల్ చేసి రిటైర్ మెంట్ తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ధవన్ ఉంటే జట్టులో ఒక స్థానం వేస్ట్ అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.