టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఘోర పరాభవంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని చెప్పి, దరఖాస్తులను ఆహ్మానించింది. ఈ క్రమంలోనే బీసీసీఐ సెలెక్టర్ల పోస్టు కోసం కొందరు సీనియర్ ఆటగాళ్లు దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది.
సోమవారంతో ఈ దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సెలెక్టర్ పోస్టు కోసం దరఖాస్తు చేసిన వారిలో మాజీ క్రికెటర్లు నయాన్ మోంగ్యా, మనీందర్ సింగ్, శివ్ సుందర్ దాస్, అజయ్ రాత్రా తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను ఇంటర్వ్యూ చేయడం కోసం ప్రత్యేకంగా క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లలో కేవలం నయామ్ మోంగ్యా ఒక్కడే.. జూనియర్, సీనియర్ స్థాయుల్లో సెలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న వాడు.
వీరిల శివ సుందర్ దాస్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర జట్టుకు బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు. గతంలో భారత మహిళల జట్టుకు కూడా బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడీ మాజీ క్రికెటర్. అంతేకాదు, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో కూడా సేవలు అందించాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సెలెక్షన్ ప్యానెల్లో ఈస్ట్ నుంచి ఉన్న దేబాషిష్ మొహంతీ స్థానంలో దాస్ను ఎంపిక చేస్తారు.
ఇదే సమయంలో సౌత్ నుంచి సెలెక్షన్ కమిటీలో రిప్రజంటేషన్ కోసం హేమంగ్ బదానీ దరఖాస్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్కు ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బదానీకి కూడా ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం బీసీసీఐ వేటు వేసిన చేతన్ శర్మ కమిటీలో దేబాశిష్ మొహంతీ తప్ప మిగతా వాళ్లు మళ్లీ ఈ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. మరి వాళ్లు మళ్లీ సెలెక్షన్ పోస్టుల కోసం దరఖాస్తులు చేస్తారో లేదో చూడాలి.