
ఈసారి మినీ వేలం రోలర్ కోస్టర్ రైడ్లా సాగింది. న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను బేస్ ధర రూ.2 కోట్లకే గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయడంతో వేలం మొదలైంది. ఆ తర్వాత శామ్ కర్రాన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, నికోలస్ పూరన్ తదితర ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేశాయి. వీళ్లే కాదు ఇంకా టీమిండియా తరఫున అరంగేట్రం చేయని దేశవాళీ ప్లేయర్ల కోసం కూడా ఫ్రాంచైజీలు భారీగానే ఖర్చు పెట్టాయి. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన శివమ్ మావికి ఈసారి భారీ ధర లభించింది. అతన్ని డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది.
మావినే కాదు మరికొందరు దేశవాళీ ఆటగాళ్ల జాతకాలు కూడా మినీ వేలంతో మారిపోయాయి. బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ కోసం పంజాబ్, ఢిల్లీ, చెన్నై గట్టిగా పోటీ పడ్డాయి. చివరకు అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. మావి, ముఖేష్ ఇద్దరూ కలలో కూడా ఊహించని ఈ ఆఫర్లు దక్కడంపై చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ తరఫున రాణించిన వివ్రాంత్ శర్మ కోసం సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. చివరకు అతన్ని రూ.2.6 కోట్లకు సన్రైజర్స్ చేజిక్కించుకుంది.
2018లో విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్ యోయో టెస్టు స్కోర్ రికార్డును బద్దలు కొట్టిన మయాంక్ దగర్ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే అందరినీ వెనక్కు నెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఈ హిమాచల్ ప్రదేశ్ కుర్రాడిని రూ.1.8 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది. భారత టెస్టు జట్టులో కొంత కాలంగా ఎంపిక అవుతున్నప్పటికీ.. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ ఇంకా భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. అతన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది.