
మహిళల ఐపీఎల్కు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలోనే క్రీడాకారిణుల వేలం కూడా మొదలైంది. బీసీసీఐ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఈ క్రీడా వేడుకను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మహిళల ఐపీఎల్కు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. మహిళా క్రికెటర్ల వేలానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్ కోసం 1525 మంది క్రీడాకారిణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
వీళ్లందరిలో మొత్తం 409 మంది మాత్రమే మహిళల ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 246 మంది భారతీయ ప్లేయర్లు కాగా, 163 మంది విదేశీ క్రీడాకారిణులు. ఫారెన్ ప్లేయర్లలో 8 మంది అసోసియేట్ దేశాలకు చెందిన వారు. అలాగే వేలంలోని ప్లేయర్లలో తమ తమ దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచులు ఆడిన క్యాప్డ్ ప్లేయర్లు 202 మంది. మిగతా వారిలో 199 మంది అంతర్జాతీయ అరంగేట్రం ఇంకా చెయ్యలేదు.
మహిళల ఐపీఎల్లో మొత్తం ఐదు జట్లు ఉన్నాయి. టైటిల్ కోసం ఇవే పోటీపడతాయి. ఈ ఐదు జట్ల వద్ద మొత్తం 90 స్లాట్స్ ఉన్నాయి. వీటిలో 30 స్లాట్లు విదేశీ ప్లేయర్లకు కేటాయించారు. ఇక వేలం విషయానికి వస్తే.. ఐపీఎల్ కోసం రిజిస్టర్ చేసుకున్న వారిలో అత్యంత చిన్న వయస్కురాలైన ప్లేయర్ వయసు కేవలం 15 సంవత్సరాలే కావడం గమనార్హం. పేసర్ షబనామ్ షకీల్, ఎడం చేతి వాటం స్పిన్నర్లు సోనమ్ యాదవ్, విన్నీ సూజన్ ముగ్గురూ కూడా ఈ వేలంలో ఉన్నారు. వీళ్లందరి వయసు కేవలం 15 సంవత్సరాలే కావడం విశేషం. ఇక అందరి కన్నా పెద్ద వయసు ఉన్న ప్లేయర్ ఎవరంటే? భారత వెటరన్ ప్లేయర్ లతిక కుమారి అని చెప్పాలి. భారత్ తరఫున 2009-2015 మధ్యలో ఆరు టీ20 మ్యాచులు ఆడిందామె. ప్రస్తుతం లతిక వయసు 41 సంవత్సరాలు. ఆమె తర్వాతి స్థానంలో జింబాబ్వేకు చెందిన ప్రెషియస్ మరాంగే ఉంది. మరాంగే వయసు 40 సంవత్సరాలు.