కోహ్లీకి విశ్రాంతి:
తీరికలేని షెడ్యూల్, ఫామ్తో సతమతమవుతోన్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి దక్షిణాఫ్రికా సిరీస్కు విశ్రాంతిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మకు తొడ కండరాలు పట్టేయడంతో న్యూజిలాండ్ పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ పూర్తిగా కోలుకోని రోహిత్.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్కు టీమిండియా సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో సెలక్టర్లకు పెద్ద సమస్య వచ్చింది. అయితే నలుగురు ఆటగాళ్లు టీమిండియా కెప్టెన్ రేసులో ఉన్నారు.
శిఖర్ ధావన్:
టీమిండియా కెప్టెన్ రేసులో శిఖర్ ధావన్, మనీష్ పాండే, లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. సినీయర్ ఆటగాడు శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్గా 2018 నిదాహస్ ట్రోఫీ, ఆసియా కప్లలో వ్యవహరించాడు. ఇటీవల స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో గాయపడినా.. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించాడని సమాచారం. గతంలో ఇండియా-ఎ.. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అయితే ఇప్పటివరకు భారత జట్టుకు మాత్రం నాయకత్వం వహించలేదు.
లోకేష్ రాహుల్:
పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ఫామ్లో ఉన్న లోకేష్ రాహుల్ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20లో భారత జట్టును నడిపించాడు. రాహుల్కి పెద్దగా కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. అయితే ఐపీఎల్ 2020లో కింగ్స్ లెవన్ పంజాబ్కు నేతృత్వం వహిస్తున్నాడు. రాహుల్ను భావి భారత కెప్టెన్గా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. కోహ్లీకి విశ్రాంతినిచ్చే క్రమంలో రాహుల్.. సారథ్య బాధ్యతలకు గట్టిపోటీనిస్తాడు.
శ్రేయస్ అయ్యర్:
శ్రేయస్ అయ్యర్ ఇండియా-ఎ జట్టుకు అన్ని ఫార్మాట్లలో సారథిగా వ్యవహరించాడు. వైట్బాల్ క్రికెట్లో భారత జట్టులో నెం.4 స్థానంలో సత్తా చాటుతున్నాడు. గత రెండేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. గతేడాది శ్రేయస్ సారథ్యంలోనే ఆరేళ్ల తర్వాత ఢిల్లీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ముంబైకి రెండేళ్ల కిందట విజయ్ హజారే ట్రోఫీని అందించాడు. ఈక్రమంలో టీమిండియా సారథ్యం కోసం అయ్యర్ పోటీపడుతున్నాడు.
మనీశ్ పాండే:
మనీశ్ పాండే కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. దేశవాళీల్లో ఈ సీజన్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలలో కర్ణాటను పాండే విజేతగా నిలిపాడు. ఇక ఇండియా-ఎకు కూడా అప్పుడప్పుడు సారథ్యం వహిస్తుంటాడు. అతను కెప్టెన్సీ వహించిన అన్ని మ్యాచ్లను ఇండియా-ఎ గెలవడం ఇక్కడ విశేషం. పాండే సారథ్యంలోనే 2019లో కర్ణాటక ఆడిన 16 మ్యాచ్ల్ని గెలిచింది. అయితే వన్డేల్లో భారత తుది జట్టులో పాండే రెగ్యులర్ ఆటగాడు కాదు.
కోహ్లీకి విశాంత్రి, రోహిత్ ఫిట్గా లేకపోతేనే:
సినీయర్ ఆటగాడు రవీంద్ర జడేజాపై కూడా సెలక్షన్ కమిటీ దృష్టి సారించినట్లు సమాచారం తెలుస్తోంది. ఆల్రౌండర్గా జడేజా రాణించడంతో పాటు ప్రస్తుతం జట్టులోని అందరికంటే సినీయర్ కావడం, దక్షిణాఫ్రికాపై అనేక సిరీస్లు ఆడిన అనుభవం అతనికి ఉంది. విరాట్ కోహ్లీకి విశాంత్రిని ఇచ్చి, రోహిత్ శర్మ ఫిట్గా లేకపోతే.. వీరిలో ఒకరు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నారు.