హైదరాబాద్: ఆసీస్తో ముగిసిన వన్డే సిరిస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనబర్చడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సమర్ధించాడు. క్రికెట్లో ఇలాంటివి సహజమని కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.
ఆసీస్తో జరిగిన ఐదు వన్డేల సిరిస్లో కోహ్లీ కోల్కతా (92) వన్డేలో మినహా చెన్నై(0), ఇండోర్ (28), బెంగళూరు (21), నాగ్ పూర్ (39) వన్డేల్లో విఫలమైన సంగతి తెలిసిందే. ఇండియా టీవీకి ఇచ్చిన 'క్రికెట్ కి బాత్' కార్యక్రమంలో సెహ్వాగ్ ఈ విషయంపై స్పందించాడు.

కొన్ని మ్యాచ్లలో విఫలమవడం క్రికెట్లో సహాజమని, ఈ విషయంలో కోహ్లీ ఫామ్ను తప్పుబట్టాల్సిన అవసరం లేదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. త్వరలో న్యూజిలాండ్, శ్రీలంకలతో స్వదేశంలో జరిగే మ్యాచ్లతో కోహ్లీ సేన బిజీగా గడపనుందని ఆయా జట్లపై కోహ్లీ తప్పక రాణిస్తాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ ప్రస్తుత ఆటను చూడవద్దని శ్రీలంక, న్యూజిలాండ్లపై భారత్ తరుపున కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ ఓ ఛాంపియన్ ప్లేయర్ అని, అతడి సామర్ధ్యాలు తెలుసని, జట్టు కోసం భారీ స్కోర్లు తప్పక చేస్తాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇప్పటికే కోహ్లి 66 టెస్లుల్లో 4658 పరుగులు, 199 వన్డేల్లో 8767, 50 టీ20ల్లో 1830 పరుగులు పూర్తి చేశాడు. టెస్టు, వన్డేలు కలిపి ఇప్పటివరకు కోహ్లీ 47 సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్లో భాగంగా తొలి టీ20 రాంచీ వేదికగా శనివారం జరగనుంది.