టీ20 సిరీస్ను 1-1తో సమం చేసిన భారత్ వన్డే సిరీస్లో చెలరేగింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ (108; 114 బంతుల్లో), తిలక్ వర్మ (52; 77 బంతుల్లో), రింకూ సింగ్ (38; 27 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. అర్షదీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), అవేశ్ ఖాన్ (2/45) సత్తాచాటారు. సఫారీ జట్టు ఓపెనర్ టోనీ డిజోర్జి (81; 87 బంతుల్లో) పోరాడాడు.
సిరీస్లో వికెట్లతో విజృంభించిన అర్షదీప్ సింగ్ పలు రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికాలో పర్యటించిన జట్లలో అత్యధిక సార్లు 4కు పైగా వికెట్లు సాధించిన అయిదో బౌలర్గా రికార్డు సృష్టించాడు. అయిదుగురిలో చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్లే ముగ్గురు ఉండటం విశేషం. అలాగే భారత్-దక్షిణాఫ్రికా వన్డేల్లో తొలి అయిదు అత్యుత్తమ బౌలర్ల ప్రదర్శనలో అర్షదీప్ గణాంకాలే (5/37; 4/30) రెండు సార్లు ఉన్నాయి.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న అనంతరం అర్షదీప్ సింగ్ మాట్లాడాడు. '' మా ప్లాన్ చాలా సింపుల్. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడమే. దీని వల్ల LBW అయినా, బౌల్డ్ అయినా చేయొచ్చు. కొన్ని సార్లు పిచ్ అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాంటి టైమ్లో అంపైర్ల నుంచి మనకు కొంత మద్దతు కావాలి. అందుకే అన్ని సార్లు అపీల్ చేస్తుంటా (నవ్వుతూ)''
''యువ క్రికెటర్లకు ఐపీఎల్ చక్కని వేదిక. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ ఆటలో పెద్దతేడా లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్కు తగ్గట్టుగా మానసికంగా సన్నద్ధమైతే సరిపోతుంది.అదే మనకి సాయం చేస్తుంది. మాకు వచ్చే అవకాశాల్ని మేం ప్రేమిస్తున్నాం. భవిష్యత్తులో గొప్పగా రాణించడానికి ప్రయత్నిస్తాం'' అని అర్షదీప్ సింగ్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో అర్షదీప్ పది వికెట్లు సాధించాడు.