MI VS DC Karun Nair: కరుణ్ నాయర్.. ఇప్పట్లో ఈ పేరును క్రికెట్ అభిమానులు అస్సలు మర్చిపోయేలా లేరు. వాళ్లు మర్చిపోవడం కాదు.. అతడే తన పేరును మర్చిపోయేలా చేసేలా లేడు. గత కొన్ని నెలలుగా దేశవాళీ క్రికెట్ లో తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో పరుగుల వరద, సెంచరీలు సునామీ సృష్టిస్తూనే ఉన్నాడు.
తాజాగా మరోసారి ఐపీఎల్ లోనూ ఇదే కొనసాగించాడు. ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయినా.. ఆ జట్టు తరఫున అతడు ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేదే. ఈ మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతడు.. సంచలన బ్యాటింగ్ చేశాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. 40 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. వరల్డ్ బెస్ట్ పేసర్లలో ఒకడైన బుమ్రా బౌలింగ్లో అయితే రెచ్చిపోయి మరీ ఆడాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం పలు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు.
బుమ్రా ఎలాంటోడు అయినా..
"నేను బాగా ఆడుతున్నాననే నమ్మకం నాలో ఉంది. నేను ఓ ఫ్లోలో ఉన్నాను. ఫ్లోలో ఉన్నప్పుడు దాన్ని ఆపకూడదు. కొనసాగించాలి. అయితే బుమ్రా.. ప్రపంచంలోనే టాప్ బౌలర్. కాబట్టి, నేను జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. కానీ నన్ను నేను బలంగా నమ్మాను. నా బలమైన షాట్లను గుర్తించి ఆ దిశగా ఆడాను." అని కరుణ్ చెప్పుకొచ్చాడు.
విలువ లేదు..
"మ్యాచ్ గెలవాలనే మేమంతా కలిసి ఆడతాం. అందుకే ఇప్పుడు ఓడిపోవడం నిరాశగా ఉంది. మనం ఎంత స్కోరు చేసినా, జట్టు గెలవకపోతే దానికి విలువ ఉండదు. నా వరకు జట్టు గెలవడమే నాకు అత్యంత ముఖ్యం. కానీ అది జరగలేదు. అయితేనేం ఈ ఓటమి నుంచి తప్పులు నేర్చుకుని, ముందుకు వెళ్తాం. నేను ఇలాంటి మంచి ప్రదర్శన కొనసాగిస్తానని ఆశిస్తున్నాను. కచ్చితంగా మేం గెలుస్తాం. ఇప్పుడు నా ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను బాగా ఆడినప్పటికీ ఆటను ముగించలేకపోయాను. అదే నన్ను బాధ కలిగిస్తోంది," అని కరుణ్ నాయర్ అన్నాడు.
అందుకే ఓడాం..
"క్రీజులో కుదురుకున్న ఆటగాడు ఆటను కొనసాగించడం చాలా ముఖ్యం. కానీ మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. అందుకే చివర్లో ఓడిపోయాం. అయినా కూడా ముంబయి బౌలింగ్ను అభినందించాలి. వారు మనపై ఒత్తిడి తెచ్చారు," అని కరుణ్ నాయర్ పేర్కొన్నారు.
భారత జట్టులో ఎంట్రీపై..
భారత జట్టులోకి రీఎంట్రీ గురించి అడగగా.. "ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా ఐపీఎల్పైనే ఉంది. భవిష్యత్తు గురించి ఇప్పటికైతే ఎక్కువగా ఆలోచించట్లేదు. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ప్రస్తుతం నాకు దక్కిన అవకాశాలను ఉపయోగించుకోవడమే ముఖ్యం," అని కరుణ్ వెల్లడించాడు.
