బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం, కెప్టెన్ రోహిత్ శర్మను వచ్చే టీ20 ప్రపంచకప్ లో ఎంపిక చేసే విధానం, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యతో పాటు పేసర్ మహ్మద్ షమి గాయాల గురించి జై షా మాట్లాడాడు.
ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ తో టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఒప్పందం ముగిసింది. కానీ వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ద్రవిడ్ ను అప్పటివరకు కోచ్ గా కొనసాగమని కోరింది. దీనికి ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అయితే టీ20 ప్రపంచకప్ వరకు మాత్రమే కాకుండా కోచ్ గా ద్రవిడ్ ను మరికొంతకాలం ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుందని జైషా తెలిపాడు. ప్రస్తుతం ద్రవిడ్ టీమిండియాతో సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. అది ముగిసిన తర్వాత ద్రవిడ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జైషా వెల్లడించాడు.

హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి ఫిట్ నెస్ గురించి జైషా మాట్లాడుతూ.. ''ప్రస్తుతం హార్దిక్ NCA పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు కోలుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. అఫ్గానిస్థాన్ తో జరిగే సిరీస్ కంటే ముందే హార్దిక్ కోలుకుంటాడు. ఇక షమి.. సౌతాఫ్రికా సిరీస్ కోసం సిద్ధంగా ఉన్నాడు. త్వరలో NCAకి వెళ్తాడు. తక్కువ సమయంలోనే కోలుకుంటాడు'' అని అన్నాడు. వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడి హార్దిక్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు షమి చీలమండల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.
అయితే టీ20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ తన స్థానం గురించి బీసీసీఐని క్లారిటీ అడిగాడని, బోర్డు కూడా తన కెప్టెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పొట్టికప్ లో రోహిత్ స్థానం గురించి గ్యారెంటీ ఇవ్వలేమని జైషా అన్నాడు. ''జూన్ లో టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. దాని కంటే ముందు ఐపీఎల్, అఫ్గానిస్థాన్ తో సిరీస్ ఉంటాయి. అప్పటికి ఓ మంచి నిర్ణయం తీసుకుంటాం'' అని జైషా పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ నకు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ జూన్ 3 నుంచి 30 వరకు జరగనుంది.