
సోషల్ మీడియాలో ట్రోలింగ్:
గత కొంత కాలంగా శ్రీలంక జట్టు వరుస ఓటములను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్స్ క్రికెట్కు వీడ్కోలు పలకడం.. బోర్డు, ప్లేయర్స్ మధ్య వివాదాల కారణంగా చిన్న జట్లపై కూడా లంక పరాజయాలను ఎదుర్కొంది. దీనికి తోడు రెండో వన్డేలో ఓటమి దిశగా పయనిస్తున్నపుడు శ్రీలంక కోచ్ మికీ ఆర్థర్, లంక కెప్టెన్ దసున్ శనక గొడవ పడ్డారు. ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులపై మైదానంలోకి వచ్చి ఆర్థర్ అసహనం వ్యక్తం చేశాడు. అదే విధంగా చివరిదైన మూడో వన్డేలో 23వ ఓవర్లో డీఆర్ఎస్ విషయంలో దసున్ సేన తత్తరపాటుకు గురయ్యాడు. ఈ అంశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

కొంతమంది ఇడియట్స్ ఉంటారు:
సోషల్ మీడియాలో తమపై వస్తున్న ట్రోల్స్పై మూడో వన్డే అనంతరం శ్రీలంక హెడ్ కోచ్ మికీ ఆర్థర్ స్పందిస్తూ... కొంతమంది ఇడియట్స్ ఉంటారన్నాడు. ట్రోల్స్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని లంక ఆటగాళ్లకు ఆయన విజ్ఞప్తి చేశాడట. 'కొంతమంది ఇడియట్స్ ఉంటారు. వాళ్లకే అంతా తెలుసనని భావిస్తారు. నిజానికి వాళ్లకు ఏమీ తెలియదు. కాబట్టి వారికి దూరంగా ఉండటం మంచిది. అందుకే సామాజిక మాధ్యమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని లంక ఆటగాళ్లకు సూచించా. ఎందుకంటే కొన్ని అర్ధంపర్ధం లేని విషయాలు ప్రభావం చూపుతాయి' ఆర్థర్ అన్నాడు.

భానుక మంచి కోసమే:
శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండోపై మికీ ఆర్థర్ ప్రశంసలు కురిపించాడు. ఫిట్నెస్ లోపాల కారణంగా వారిద్దరు కొన్ని మ్యాచ్లు మిస్పయ్యారని, అయితే ఇప్పుడు గాడిలో పడ్డారని పేర్కొన్నాడు. మూడో వన్డే మ్యాచ్లో ఇద్దరి ప్రదర్శన తనకెంతో సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. భానుక మంచి కోసమే కొన్నిసార్లు తన పట్ల కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చిందని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. వన్డే సిరీస్లో లంక జట్టు చాలా నేర్చుకుందని, ఆటగాళ్ల పురోగతి అత్యద్భుతంగా ఉందన్నాడు. తాము ఎంతో మెరుగుపడాల్సి ఉందని, అందుకోసం కష్టపడతామని ఆర్థర్ తెలిపాడు. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది.


Click it and Unblock the Notifications












