టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సర్జరీ చేయించుకున్నాడు. హెర్నియా సమస్యతో బాధ పడుతున్న సూర్య శస్త్ర చికిత్స కోసం ఇటీవల జర్మనీ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యులు అతడికి బుధవారం సర్జరీ చేశారు. కాగా, తాను త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన వారికి సూర్యకుమార్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు చెప్పాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫొటోను జత చేసి ట్వీట్ చేశాడు.
అయితే హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ కూడా సూర్య భారత్-అఫ్గానిస్థాన్ ఆఖరి టీ20 మ్యాచ్ చూశాడు. రింకూ సింగ్ హాఫ్ సెంచరీ సాధించిన వీడియో క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. ఇది కచ్చితంగా భగవంతుడు రాసిన కథ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే రోహిత్ శర్మ సెంచరీ గురించి కూడా స్టోరీ పోస్ట్ చేశాడు. హార్ట్ సింబల్తో రోహిత్ను గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్గా అభివర్ణించాడు.

గతంలో సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ సింబల్ను రోహిత్ను ఉద్దేశించి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యను నియమించడంపై సూర్య పరోక్షంగా స్పందిస్తూ పోస్ట్ పెట్టాడు. ఎలాంటి కామెంట్స్, హ్యాష్ ట్యాగ్ లేకుండా ఎమోజీ రూపంలో తన ఆవేదనను పంచుకున్నాడు. ఇప్పుడు తిరిగి ఫుల్ హార్ట్ సింబల్ పోస్ట్ చేశాడు.
కెరీర్ పరంగా సూర్యకుమార్ యాదవ్కు రోహిత్ శర్మ ఎంతో అండగా నిలిచాడు. రోహిత్ చొరవతో సూర్యకుమార్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. హిట్ మ్యాన్ సారథ్యంలోనే వరుసగా అవకాశాలు అందుకొని నెంబర్ వన్ టీ20 బ్యాటర్గా, టీ20 తాత్కలిక సారథిగా సూర్య ఎదిగాడు. దీంతో రోహిత్ విషయంలో సూర్య ఎప్పుడూ ఎమోషనల్గా ఉంటాడు. కాగా, సర్జరీ చేయించుకున్న సూర్యకుమార్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుంది. ఐపీఎల్ ప్రారంభ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేడు. కానీ టీ20 ప్రపంచకప్ సమయానికి అందుబాటులో ఉంటాడు.
మరోవైపు బెంగళూరు వేదికగా భారత్-అఫ్గాన్ ఆఖరి మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు అఫ్గానిస్థాన్ బౌలర్లు షాకిచ్చారు. ఫరీద్ అహ్మద్ (3/20), అజ్మతుల్లా (1/33) ధాటికి 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ రోహిత్ శర్మ (121*; 69 బంతుల్లో), రింకూ సింగ్ (69*; 39 బంతుల్లో) అద్భుత పోరాటంతో స్కోరును 212/4కు చేర్చారు.
ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లకు 212/6 స్కోరుతో నిలిచి మ్యాచ్ను 'టై' గా ముగించింది. గుర్బాజ్ (50; 32 బంతుల్లో), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో), నైబ్ (55*; 23 బంతుల్లో), నబి (34; 16 బంతుల్లో) పోరాడారు. అనంతరం సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 16/1తో నిలిచింది. అయితే సూపర్ ఓవర్ ఛేజింగ్లో భారత్ కూడా 16 పరుగులే చేయడంతో ఫలితం కోసం మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్లో రోహిత్ సేన విజయం సాధించింది.