
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2022 కోసం సిద్ధమవుతున్నాడు. గత ఏడాది చెన్నైసూపర్ కింగ్స్ను విజేతగా నిలబెట్టిన ధోని ఈ సారి కూడా ట్రోఫి అందించాలని పట్టుదలగా ఉన్నాడు. అందులో భాగంగానే నెల రోజులు ముందుగానే ధోని కసరత్తు మొదలుపెట్టాడు. అయితే ఐపీఎల్ 2022కు ప్రచారంలో భాగంగా టోర్నీ ప్రసారుదారు చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనితో తీసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో ఖాకీ దుస్తుల్లో ఉన్న ధోని బస్సు డ్రైవర్గా కనిపించాడు. అంతేకాకుండా నిండైనా మీసంతోపాటు కళ్ల అద్దాలు కూడా పెట్టుకున్నాడు. ఇలా గతంలో ఎన్నడూ లేని కొత్త గెటప్లో ధోని దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. చూసిన వెంటనే అభిమానులు గుర్తు పట్టడం కూడా కష్టంగా ఉందని చెప్పుకోవాలి.
అంతేకాకుండా ధోని ఈ కొత్త లుక్ ఎలా ఉందని వీడియోలో అభిమానులను అడిగారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియె నెట్టింట వైరల్గా మారింది. కాగా ధోని కొత్త లుక్పై అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ ప్రచారంలో భాగంగా గతేడాది తీసిన వీడియోలో ధోని సన్యాసిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క వీడియోనే కాకుండా స్టార్ స్పోర్ట్స్ ధోనికి సంబంధించి మరొక ఫస్టు లుక్ లాంటి పోస్టర్ను కూడా విడుదల చేసింది. అందులో ధోని చేతిలో మైక్ పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. ఇది కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన 40 ఏళ్ల ధోని ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే చెన్నైసూపర్ కింగ్స్కు ఈ సారి కూడా ట్రోఫి అందించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటికే ఐపీఎల్లో ధోని నాయకత్వంలో చెన్నైసూపర్ కింగ్స్ 4 సార్లు ట్రోఫీ గెలిచింది. గతేడాది ట్రోఫిని చెన్నైసూపర్ కింగ్సే గెలుచుకోవడం గమనార్హం. ఐపీఎల్లో ఇప్పటివరకు 220 మ్యాచ్లు ఆడిన ధోని 39 సగటుతో 4746 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్ 84*గా ఉంది.