ఐపీఎల్-2024 ఫైనల్లో ఓటమిపాలైనప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన పోరాటాన్ని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. టీ20 క్రికెట్లో ఎస్ఆర్హెచ్ సరికొత్త ట్రెండ్ సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో విధ్వంసం ఎలా సృష్టించాలో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. విజయాలతో హోరెత్తించింది.
సన్రైజర్స్ సాధించిన విజయాల్లో తెలుగు యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి కీలకపాత్ర పోషించాడు. ఈ 21 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ సత్తాచాటాడు. ఈ సీజన్లో 143 స్ట్రైక్రేటుతో దాదాపు 300 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. కాగా, నితీశ్ అవార్డును అందుకున్న సమయంలో తన ఫ్యామిలీ భావోద్వేగానికి గురయ్యారు.

నితీశ్ తల్లిదండ్రుల కళ్లలో ఆనందభాష్ఫాలు కనిపించాయి. ఓ వైపు కన్నీళ్లు, మరోవైపు చిరునవ్వుతో నితీశ్ను చూస్తూ వాళ్లు మురిసిపోయారు. ఈ ఎమోషనల్ వీడియోను సన్రైజర్స్ హైదరాబాద్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఈ మధుర క్షణాలకు జెర్నీ మూవీలోని ఆరంభమే సాంగ్ జోడించి వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. నితీశ్ భవిష్యత్ స్టార్ అవుతాడని, భారత్కు మంచి ఆల్రౌండర్ అవుతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎవరీ నితీశ్ రెడ్డి?
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి నేపథ్యం ఏంటని ఆరాతీశారంతా. కష్టమైన పిచ్పై ఆ మ్యాచ్లో నితీశ్ 37 బంతుల్లో 64 పరుగులు బాదాడు. ఈ తెలుగు ఆల్రౌండర్ను సన్రైజర్స్ గతేడాది రూ.20 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. కాగా, నితీశ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించాడు. అతనిది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం.
నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్లో ఉద్యోగం చేసేవారు. నితీశ్ క్రికెటర్గా ఎదగడంలో ముత్యాల రెడ్డిది ప్రధాన పాత్ర. నితీశ్ కోసం ఆయన తన ఉద్యోగానికే రాజీనామా చేశారు. ఇక కెరీర్ ఆరంభంలో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో నితీశ్ కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఓపెనింగ్ చేసిన నితీశ్ కుమార్ రెడ్డి మీడియం పేసర్గా సత్తా చాటాడు. ఇండియ అండర్ 19-బి టీమ్కు ప్రాతినిథ్యం వహించాడు. 2019-20 రంజీ సీజన్తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.